డిప్యూటీ సీఎంగా సిద్దూకు ప్రమోషన్ !

ABN , First Publish Date - 2021-03-17T18:21:41+05:30 IST

కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూకు పంజాబ్ డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ లభించనుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అధిష్ఠానం

డిప్యూటీ సీఎంగా సిద్దూకు ప్రమోషన్ !

అమృత్‌సర్ : కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూకు పంజాబ్ డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ లభించనుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్దూకు కొంత కాలంగా వైరం నడుస్తోంది. ఈ వ్యవహార ప్రభావం ఎన్నికలపై పడకుండా అధిష్ఠానం జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సిద్దూకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. సీఎం, సిద్దూ మధ్య విభేదాలు తార స్థాయికి చేరుకోవడంతో జూలై 2019 న కేబినెట్ నుంచి వైదొలిగారు. ఆ తర్వాత కేబినెట్‌లో చేరాల్సిందిగా, విద్యుత్ శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని సీఎం అమరీందర్ సింగ్ పలుమార్లు విజ్ఞప్తి కూడా చేశారు. సిద్దూ ససేమిరా అంగీకరించలేదు. తనకు డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు పీసీసీ పదవి కూడా కావాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాలతో సీఎం, సిద్దూ మధ్య గ్యాప్ అలాగే కొనసాగుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధిష్ఠానం అలర్ట్ అయ్యింది. వారిద్దరి మధ్య సఖ్యత కుదుర్చాలని, ఎన్నికల నాటికి వారిద్దరూ ఒకేతాటిపై నడవాలన్న ధ్యేయంతో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హరీశ్ రావత్‌ను పంజాబ్ కు పంపింది. వీరిద్దరి మధ్య సఖ్యత కుదుర్చే బాధ్యతను ఆయన భుజ స్కంధాలపై మోపింది. ఈ క్రమంలోనే సిద్దూకు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టనున్నట్లు సమాచారం. అయితే ఈ పదవి సృష్టించడం సీఎం అమరీందర్ సింగ్‌కు ఏమాత్రం ఇష్టముండదు. 

Updated Date - 2021-03-17T18:21:41+05:30 IST