దిగజారిన మోదీ రేటింగ్‌

ABN , First Publish Date - 2021-05-20T06:54:50+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమోదయోగ్యతకు సంబంధించి రేటింగ్‌ మరింత పడిపోయింది. మోదీ రేటింగ్‌ ప్రస్తుతం 63 శాతానికి దిగజారిందని అమెరికాకు చెందిన డేటా ఇంటెలిజెన్స్‌ కంపెనీ ‘మార్నింగ్‌’ వెల్లడించింది

దిగజారిన మోదీ రేటింగ్‌

63 శాతానికి పడిపోయిందన్న సర్వే

అమెరికా ఇంటెలిజెన్స్‌ సంస్థ వెల్లడి

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ వల్లే!

బ్రిటన్‌ పోలింగ్‌ ఏజెన్సీ సర్వేలోనూ ప్రధాని మోదీపై తగ్గిన విశ్వాసం!


న్యూఢిల్లీ, మే 19 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమోదయోగ్యతకు సంబంధించి రేటింగ్‌ మరింత పడిపోయింది. మోదీ రేటింగ్‌ ప్రస్తుతం 63 శాతానికి దిగజారిందని అమెరికాకు చెందిన డేటా ఇంటెలిజెన్స్‌ కంపెనీ ‘మార్నింగ్‌’ వెల్లడించింది. ప్రపంచంలోని 13 మంది ముఖ్యనేతల రేటింగ్‌ను ప్రతి వారం ట్రాక్‌ చేస్తున్న ఈ సంస్థ.. 2019 ఆగస్టు నుంచి మోదీ జనాదరణను ట్రాక్‌ చేస్తూ వస్తోంది. దే శంలో కరోనా మహమ్మారి రెండో ప్రభంజనాన్ని అరికట్టలేక ప్రభుత్వ యంత్రాంగం సతమతమవుతున్న నేపథ్యంలోనే మోదీ రేటింగ్‌ పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మోదీ ఆమోదయోగ్యత అత్యధికంగా 22 పాయింట్లకు పడిపోయిందని మార్నింగ్‌ సంస్థ సర్వేలో వెల్లడైంది. గతంలో ఎప్పుడూ ఆయన రేటింగ్‌ ఇంతగా పడిపోలేదని ఈ సంస్థ అంచనాలను బట్టి అర్థమవుతోంది.


దేశంలో ఢిల్లీ వంటి మహా నగరాల్లో సైతం ఆస్పత్రుల్లో ప్రాణాలను కాపాడే ఆక్సిజన్‌, పడకల వంటి వైద్యసౌకర్యాలు లేక ప్రజలు మరణించడం, పార్కింగ్‌ స్థలాల్లో జనం ప్రాణాలు కోల్పోవడం గురించి అంతర్జాతీయ మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి. శ్మశానాల్లో శవాలు పేరుకుపోవడంపై సోషల్‌ మీడియాలో కథనాలు కూడా అంతర్జాతీయ పరిశీలకుల దృష్టికి వచ్చాయి. కాగా బ్రిటన్‌కు చెందిన యూగవ్‌ (యువర్‌ గ వర్నమెంట్‌) అనే  పోలింగ్‌ ఏజెన్సీ కూడా ఫిబ్రవరిలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వ సమర్థత పట్ల ప్రజల విశ్వాసం పడిపోతూ వస్తోందని తన తాజా సర్వేలో తేల్చింది. గత ఏడాది కరోనా తొలి రోజుల్లో 89 శాతం మంది ప్రజలు.. ప్రభుత్వం బాగానే పనిచేస్తోందని అభిప్రాయపడగా, ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి 59 శాతం మంది మాత్రమే ప్రభుత్వాన్ని సమర్థించారు. ఇదిలా ఉండగా.. మోదీకి ప్రజల ప్రాణాల కంటే తన ప్రతిష్ఠే ముఖ్యంగా మారిందని హాంకాంగ్‌ నుంచి వెలువడే ఆసియా టైమ్స్‌ అభిప్రాయపడింది.

Updated Date - 2021-05-20T06:54:50+05:30 IST