కాబూల్ ఉగ్రదాడి.. 103కు పెరిగిన మృతుల సంఖ్య

ABN , First Publish Date - 2021-08-27T21:57:47+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల నిన్న జరిగిన వరుస బాంబు పేలుళ్లలో

కాబూల్ ఉగ్రదాడి.. 103కు పెరిగిన మృతుల సంఖ్య

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల నిన్న జరిగిన వరుస బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 103కు పెరిగింది. అలాగే, 143 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 12 మంది మెరైన్స్, ఓ నేవీ మెడికల్ అధికారి సహా 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు. అలాగే మరో 18 మంది గాయపడ్డారు. కాబూల్ ఉగ్రదాడికి కారణం తామేనని ఆఫ్ఘన్ అనుబంధ ఇస్లామిక్ స్టేట్ -ఐసిస్ ఖోరాసన్ (ఐసిస్-కె) ప్రకటించింది.  ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది ఫొటోను ఐఎస్ విడుదల చేసింది. పెద్ద ఎత్తున గుమిగూడిన జనాన్ని దాటుకుని కాబూల్ విమానాశ్రయం సమీపంలోని ‘బరాన్ క్యాంప్’ దగ్గరకు చేరుకున్న ఉగ్రవాది ఒక్కసారిగా తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో నిన్న 72 మంది మృతి చెందగా, తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిలో మరికొందరు ఆ తర్వాత మరణించారు. దీంతో మృతుల సంఖ్య 103కు పెరిగింది. మృతుల్లో తాలిబన్ ఫైటర్లు కూడా ఉండడం గమనార్హం.  

Updated Date - 2021-08-27T21:57:47+05:30 IST