దేశంలోనే కర్ణాటక టాప్
ABN , First Publish Date - 2021-09-03T17:28:43+05:30 IST
వ్యాక్సినేషన్లో దేశంలోనే కర్ణాటక తొలిస్థానంలో నిలిచిందని వైద్యఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి బుధవారం వ్యాక్సిన్ ఉత్సవ్ నిర్వహించాలని భావించామని ఇందులో భాగం

- వ్యాక్సిన్ ఉత్సవ్ తొలిరోజున 12 లక్షల మందికి టీకాలు
- వైద్యఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ హర్షం
బెంగళూరు: వ్యాక్సినేషన్లో దేశంలోనే కర్ణాటక తొలిస్థానంలో నిలిచిందని వైద్యఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి బుధవారం వ్యాక్సిన్ ఉత్సవ్ నిర్వహించాలని భావించామని ఇందులో భాగంగా తొలి రోజే 12 లక్షల మందికి టీకాలు వేశామని సుధాకర్ హర్షం వ్యక్తం చేశారు. బెంగళూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి బుధవారం వ్యాక్సిన్ ఉత్సవ్ను నిర్వహించదలచామన్నారు. తొలిరోజు ఉత్సవ్లో కనీసం 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అయితే లక్ష్యాన్ని అధిగమించి అదనంగా రెండులక్షకు పైగానే టీకాలు సాధ్యమైనట్లు తెలిపారు. రాష్ట్రంలోని 30 జిల్లాలలోను అన్ని ప్రాంతాలలోను టీకాలు వేశామని ఏకంగా 12,04,402 మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. దే శంలోనే కర్ణాటక తొలిస్థానంలో నిలిచిందన్నారు. బెంగళూరులో 1,85,488 మంది టీకాలు వేసుకున్నారన్నారు. బెళగావిలో 99973 మందికి సాధ్యం కాగా కొడుగు, గదగ, చామరాజనగర్, యాదగిరి జిల్లాలలో తక్కువ శాతం సాధ్యమైందన్నారు. నాలుగు జిల్లాలోను 20 వేల మందికి కంటే తక్కువగా టీకాలు వేసుకున్నారన్నారు. చిక్కబళ్ళాపురంలో 50వేల మంది, చిక్కమగళూరులో 44 వేలు, మం డ్యలో 72వేలు, మైసూరులో 51వేలు వేశారన్నారు. రోజుకు కనీసం ఐదు లక్షల మందికి టీకాలు వేసే లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ఆగస్టులో 1.12 కోట్ల డోసులు వేసుకున్నారన్నారు. పొరుగున ఉండే కేరళలో వైరస్ ఇంకా తగ్గలేదన్నారు. అక్కడ కేసులు ఇంకా వేలలోనే నమోదవుతున్నాయన్నారు. ఇందుకోసమే కేరళ నుంచి వచ్చేవారికి 14 రోజుల క్వారంటైన్ నిబంధనలు తెచ్చామన్నారు. విద్యాసంస్థలను ప్రస్తుతం తెరిచామని, నిరంతరంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పాలక మండళ్లు పర్యవేక్షించాలని సూచించామన్నారు. పరిశ్రమలు, ప్రైవేటు కంపెనీలు సొంతంగా క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఒక వేళ సంబంధిత కంపెనీలలో ఎవరికైనా కొవిడ్ ప్రబలితే అక్కడే చేర్చాలన్నారు. వివిధ రాష్ట్రాల సరిహద్దున ఉండే కర్ణాటక పరిధిలోని 20 కిలోమీటర్ల వ్యాప్తంగా అందరికీ వ్యాక్సిన్ సంపూర్ణం చేయదలచామన్నారు. కేరళ నుంచి కోలారు జిల్లా కేజీఎఫ్కు చెందిన నర్సింగ్ కళాశాలకు వచ్చిన విద్యార్థులకు కొవిడ్ ప్రబలడంపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.