కార్పొరేషన్ ఎన్నికల్లో PMK ఒంటరిపోరు
ABN , First Publish Date - 2021-12-09T14:32:25+05:30 IST
వచ్చే యేడాది ఫిబ్రవరిలో జరుగనున్న కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో పాట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ దిశగా పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్

చెన్నై: వచ్చే యేడాది ఫిబ్రవరిలో జరుగనున్న కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో పాట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ దిశగా పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్, ఆయన తనయుడు అన్బుమణి రాందాస్ పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అన్నాడీఎంకే లేదా డీఎంకేతో పొత్తుపెట్టుకుని పోటీ చేయడమే పీఎంకేకు ఆనవాయితీగా ఉంటోంది. గత శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుకుదుర్చుకుని 20 నియోజకవర్గాలలో పోటీ చేసి నాలుగుచోట్ల గెలుపొందింది. మునుపటి అన్నాడీఎంకే ప్రభుత్వం వన్నియార్లకు 10.5 శాతం అంతర్గత రిజర్వేషన్లు ప్రకటించినప్పటికీ ఆ పార్టీకి పీఎంకే వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగలేదు ఏది ఏమైనప్పటికీ శాసనసభ ఎన్నికల్లోనూ, ఇటీవల తొమ్మిది జిల్లాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పీఎంకే ఓటు బ్యాంక్ను కాస్త పెంచుకోగలిగింది. ఈ నేపథ్యంలో వచ్చే యేడాది ఫిబ్రవరిలో జరుగనున్న మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో వార్డు సభ్యులను గెలిపించుకోవాలని పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్, ఆ పార్టీ అధ్యక్షుడు జీకే మణి, యువజన విభాగం అధ్యక్షుడు డాక్టర్ అన్బుమణి రాందాస్ వ్యూహరచన చేస్తున్నారు. 2024లో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో పీఎంకే ఎక్కువ సీట్లు సంపాదించాలని నిర్ణయించింది. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలవాలంటే కార్పొరేషన్, మున్సిపాలిటీ కౌన్సిలర్లు అధికంగా పార్టీకి చెందినవారు ఉండాలని భావిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే నగరపాలక ఎన్నికల్లో ఏ పార్టీలతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేయాలనే దృఢనిశ్చయంతో ఉంది. వార్డు సభ్యులను అధికంగా గెలిపించుకుంటే కార్పొరేషన్ చైర్మన్, మునిసిపల్ చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ వార్డు సభ్యుల ఓట్లు కీలకపాత్రను పోషిస్తాయని డాక్టర్ రాందాస్ భావిస్తున్నారు.