మళ్లీ కోరలు చాచిన కరోనా... జూన్ 12 తరువాత 10 వేలకు మించిన కేసులు నమోదు!
ABN , First Publish Date - 2021-02-25T15:44:43+05:30 IST
ఏడాది కాలంగా ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. భారత్లోనూ...
న్యూఢిల్లీ: ఏడాది కాలంగా ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. భారత్లోనూ ఈ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. దేశంలో మరోమారు కరోనా కలవరం మరింత తీవ్రమైంది. గత ఏడాది ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్డౌన్ విధించారు. గత ఏడాది అంటే 2020, జూన్ 12న తొలిసారిగా 10 వేలకు మించిన కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగుపడుతున్నాయనుకుంటున్న సమయంలో మరోమారు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.
ఇప్పుడు మళ్లీ రోజుకు నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య 10 వేలు దాటింది. దేశంలో కొత్తగా 86 శాతం కేసులు మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్లలో నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో పలు రాష్ట్రాల్లో తిరిగి కరోనా కట్టడికి పలు ఆంక్షలు విధించాల్సి వస్తోంది. తాజాగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మహారాష్ట్రలోని అమరావతిలో వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. అదేవిధంగా నాగ్పూర్లోనూ మార్చి 7 వరకూ లాక్డౌన్ విధించారు. పూణెలో స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లను తిరిగి మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల తరువాత ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దనే నిబంధన విధించారు. మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 8,807 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 80 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో అత్యధికంగా కరోనా మరణాలు మహారాష్ట్రలో సంభవించాయి.