హమ్మయ్య.. గండం గడిచింది!
ABN , First Publish Date - 2021-12-06T17:00:13+05:30 IST
రాష్ట్రంలో కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్ ‘ఒమైక్రాన్’ వ్యాప్తి చెందిందంటూ గత నాలుగురోజులుగా వ్యాపించిన పుకార్లకు పుల్స్టాప్ పడింది. విదేశాల నుంచి విమానాల్లో వచ్చిన ఐదుగురికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు, ప్రయోగశాలల్లో కొత్త వైరస్
ఆ ఐదుగురికి ‘ఒమైక్రాన్’ సోకలేదు
ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం వెల్లడి
చెన్నై: రాష్ట్రంలో కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్ ‘ఒమైక్రాన్’ వ్యాప్తి చెందిందంటూ గత నాలుగురోజులుగా వ్యాపించిన పుకార్లకు పుల్స్టాప్ పడింది. విదేశాల నుంచి విమానాల్లో వచ్చిన ఐదుగురికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు, ప్రయోగశాలల్లో కొత్త వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినప్పుడు వారికి ప్రస్తుతమున్న ‘డెల్టా’ రకం కరోనా వైరస్ మాత్రమే సోకినట్లు కనుగొన్నారు. దీనితో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఊరట చెందా రు. దక్షిణాఫ్రికాలో ‘ఒమైక్రాన్’ వ్యాప్తి చెందినట్టు వార్తలు వెలువడినప్పటి నుంచి రాష్ట్రంలోని విమా నాశ్రయాల్లో ఆరోగ్యశాఖ అధికారులు తీవ్ర నిఘా ఏర్పాటు చేశారు. కొత్త వైరస్ వ్యాప్తి చెందుతున్న విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా కరోనా ముందస్తు వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నై, కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి, తూత్తుకుడి విమానాశ్రయాల వద్ద ఆర్టీపీసీఆర్, రేపిడ్ టెస్ట్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో నాలుగు రోజులకు ముందు లండన్ నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ప్రయాణికులకు ఆరోగ్యశాఖ అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో తొమ్మిదేళ్ల బాలికకు కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. అదే విమానంలో ప్రయాణించిన 36 యేళ్ళ మహిళకు కూడా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరిరువురినీ గిండీలోని కింగ్ ఇన్స్టిట్యూట్ ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్లో ఉంచారు. అదే రోజు సింగపూరు నుంచి విమానంలో తిరుచ్చికి వచ్చిన ప్రయాణికుడికి కూడా పాజిటివ్ వచ్చింది. అతడిని తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ఇదేవిధంగా శనివారం లండన్ విమానంలోంచి దిగిన 25 యేళ్ళ యువకుడికి కూడా పాజిటివ్ లక్షణాలు బయటపడటంతో అతడిని కూడా ఆ ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్లో ఉంచారు. ఇక సింగపూరు నుంచి మదురైకి వచ్చిన ఓ ప్రయాణికుడికి కూడా కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. అతడిని నాగర్కోవిల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఐదుగురి రక్తపు నమానాలను సేకరించి ప్రయోగశాలలకు పంపారు. వీరికి ‘ఒమైక్రాన్’ వైరస్ సోకిందో లేదో నిర్ధారించమంటూ ఆరోగ్యశాఖ అధికారులు ప్రయోగశాలల నిపుణులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం సైదాపేటలో వర్షబాధితులకు ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం నితావసరవస్తువులను, దుప్పట్లు, చీరలు, ధోవతులను పంపిణీ చేశారు.
ఆ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చిన చిన్నారి సహా ఆరుగురికి పరీక్షలు నిర్వహించినప్పుడు వారికి కొత్త రూపు సంతరించుకున్న ‘ఒమైక్రాన్’ సోకలేదని నిర్ధారణ అయ్యిందని ప్రకటించారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో ‘ఒమైక్రాన్’ వైరస్ వ్యాప్తి చెందినట్టు సామాజిక ప్రసార మాధ్యమాల్లో పుకార్లు పుట్టించారని, వాటిని ప్రజలు నమ్మకూడదని హెచ్చరించారు. కొత్త వైరస్ వ్యాప్తిని నిరోధించేదిశగా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అప్రమత్తంగా వ్యహరిస్తున్నారని, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు జరుపుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఐదుదురు విమాన ప్రయాణికులకు ‘డెల్టా’ వైరస్ మాత్రమే సోకిందని నిర్ధారణ కావటంతో వారికి ప్రస్తుతమున్న కరోనా నిరోధక వైద్యచికిత్సలందిస్తున్నామని చెప్పారు. విదేశాల నుంచి విమానాల్లో వచ్చే ప్రతి ప్రయాణికుడికి కరోనా ముందస్తు వైద్యపరీక్షలు చేసిన మీదటే బయటకు పంపుతున్నామని చెప్పారు. ‘ఒమైక్రాన్’ వైరస్ తాకిడికి గురయ్యేవారి కోసం అన్ని జిల్లా స్థాయి ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులను ఆక్సిజన్ సహా అన్ని సదుపాయాలతో సిద్ధం చేశామని తెలిపారు. ఈ కొత్త వైరస్ను గురించి ప్రజలు ఆందోళనచెందనవసరం లేదని తెలిపారు.