పార్లమెంట్లో మీడియాపై ఆంక్షలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్
ABN , First Publish Date - 2021-11-28T21:00:19+05:30 IST
పార్లమెంట్లో మీడియాపై ఆంక్షలు విధించడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి స్పీకర్ ఓం బిర్లాకు ఆదివారం లేఖ రాశారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్లో మీడియాపై ఆంక్షలు విధించడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి స్పీకర్ ఓం బిర్లాకు ఆదివారం లేఖ రాశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మీడియాపై ఆంక్షలు సరికాదని అధిర్ తన లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా మీడియా ఉందని, అలాంటి మీడియాను పార్లమెంటులోకి అనుమతించకపోవడం బాధాకరమని చెప్పారు. కోవిడ్-19 కారణంగా ఏడాదిన్నరగా మీడియాను పార్లమెంట్లోకి అనుమతించలేదని, ప్రస్తుతం మాల్స్, రెస్టారెంట్స్, సినిమా హాళ్లు, మార్కెట్లు సహా అన్ని చోట్లా కోవిడ్ నిబంధనలు తొలగించారని గుర్తు చేశారు. కేవలం పార్లమెంటులో మీడియాపై మాత్రమే ఈ నిబంధనలు అమలు చేస్తున్నారని అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. మీడియా నిఘా లేకుండా చేయడం ప్రజాస్వామ్యంలో ఆందోళనకర పరిణామమని, మీడియా కవరేజీపై విధించిన ఆంక్షలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రెస్ గ్యాలరీ పాసులను పునరుద్ధరించడంతో పాటు మీడియా కవరేజీకి తగిన సదుపాయాలు కల్పించాలని లోక్సభ స్పీకర్కు రాసిన లేఖలో అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు.