కాంగ్రెస్ది నెత్తుటి సేద్యం!
ABN , First Publish Date - 2021-02-06T07:31:13+05:30 IST
‘‘ప్రపంచంలో అందరూ నీళ్లతోనే వ్యవసాయం చేస్తారు. నెత్తుటితో వ్యవసాయం చేయడం కాంగ్రె్సకే సాధ్యం. బీజేపీకి చేతకాదు ’’

వ్యవసాయ చట్టాల్లో లోపాల్లేవు
విపక్షాలు ఒక్క లోపాన్నీ ఎత్తిచూపలేదు
రాజ్యసభలో మంత్రి తోమర్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ‘‘ప్రపంచంలో అందరూ నీళ్లతోనే వ్యవసాయం చేస్తారు. నెత్తుటితో వ్యవసాయం చేయడం కాంగ్రె్సకే సాధ్యం. బీజేపీకి చేతకాదు ’’ అని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వ్యాఖ్యానించారు. ఖేతీ కా ఖూన్ పేరుతో వ్యవసాయ చట్టాల్లో లోపాలపై ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ విడుదల చేసిన పుస్తకాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం ఆయన రాజ్యసభలో రాష్ట్రపతికి ధన్యవాదాల తీర్మానంపై మాట్లాడారు. వ్యవసాయ చట్టాల్లో ఎలాంటి లోపాలున్నా సవరించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడం తమ చట్టాల్లో లోపాలున్నాయని అంగీకరించడం కాదని తోమర్ స్పష్టం చేశారు. ఉద్యమిస్తున్న రైతు సంఘాలు కానీ, వారికి మద్దతు పలుకుతున్న రాజకీయ పార్టీలు కూడా ఈ చట్టాల్లో ఒక్క లోపాన్ని కూడా ఎత్తిచూపలేక పోయాయని అన్నారు.
ఇక కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని దైవ ఘటనగా అభివర్ణించడాన్ని సీపీఐ సభ్యుడు బిష్ణోయ్ విశ్వం తప్పుబట్టారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో లోపాలే ప్రస్తుత పరిస్థితికి కారణమన్నారు.
