సంపూర్ణ లాక్డౌన్తోనే కరోనా కట్టడి
ABN , First Publish Date - 2021-05-05T17:11:57+05:30 IST
రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా తీవ్రతకు ప్రస్తుతం ఉన్న ‘కరోనా కర్ఫ్యూ’ తో అదుపులోకి తీసుకురావడం అసాధ్యమని సంపూర్ణ లాక్డౌన్ ఒక్కటే పరిష్కారమని వైద్యనిపుణులు, కొవిడ్ టాస్క్
బెంగళూరు: రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా తీవ్రతకు ప్రస్తుతం ఉన్న ‘కరోనా కర్ఫ్యూ’ తో అదుపులోకి తీసుకురావడం అసాధ్యమని సంపూర్ణ లాక్డౌన్ ఒక్కటే పరిష్కారమని వైద్యనిపుణులు, కొవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొవిడ్ కర్ఫ్యూ ప్రారంభమై వారం రోజులు ముగిసినా కేసుల సంఖ్యలో ఏ మాత్రం తగ్గుదల లేకపోవడం, రోజూ 4- 5వేలు పెరుగుతున్న తరుణంలో రామబాణంలాంటి సంపూర్ణలాక్డౌన్ ఒ క్కటే పరిష్కారమని నిపుణులు సూచించారు. దీంతో మంగళవారం సీఎం యడియూరప్ప అధ్యక్షతన అత్యవసర కేబినెట్ భేటీ జరిగింది. దాదాపు మంత్రులందరూ భాగస్వామ్యులయ్యారు. చామరాజనగర్ జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆక్సిజన్ నిర్వహణ, పడకల కొరత, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, కొవిడ్ టీకాల పర్యవేక్షణను ఒక్కో మంత్రికి బాధ్యత అప్పగించారు. ఆక్సిజన్ పర్యవేక్షణను భారీ పరిశ్రమలశాఖ మంత్రి జగదీశ్శెట్టర్కు, రెమ్డెసివిర్, వ్యాక్సిన్ను డీసీఎం డాక్టర్ అశ్వత్థనారాయణకు, పడకల వ్యవస్థకు హోం మంత్రి బసవరాజ్, ఆర్ అశోక్లకు, కాల్సెంటర్ పర్యవేక్షణను అరవిందలింబావళికి అప్పగించారు. చామరాజనగర్ జిల్లా ఘటనపై తీవ్ర విచారం చేసిన కేబినెట్ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మహారాష్ట్రలో లాక్డౌన్తో నియంత్రణలోకి వస్తున్న తరుణంలో రాష్ట్రంలోనూ అమలు చేయాలనే అంశంపై చర్చించారు. కొవిడ్ నిర్వహణకు మానవవనరుల కొరత ఏర్పడుతుందనే నిపుణుల సూచన మేరకు డాక్టర్లు, నర్సులను కొవిడ్ సెంటర్లలో పనిచేసేందుకు నియమించుకోవాలని భావించారు. తద్వారా బాధితులకు మెరుగైన వైద్యం తీసుకురాదలిచారు. ఈనెల 12వరకు కరోనా కర్ఫ్యూ అమలులో ఉన్నందున ఆ తర్వాత మరింత కాలం కొనసాగించాలనే అంశం స్పష్టమైనా అంతలోగానే సంపూర్ణలాక్డౌన్ అమలు కూడా చర్చకు వచ్చింది.