ఇక లాక్డౌనే గతి : సీఎం ఉద్ధవ్ కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-04-11T00:27:18+05:30 IST
లాక్డౌన్ వైపే సీఎం ఉద్ధవ్ థాకరే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం మినహా వేరే
ముంబై : లాక్డౌన్ వైపే సీఎం ఉద్ధవ్ థాకరే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం మినహా వేరే గత్యంతరం లేదని, ఇతర మార్గాలు కూడా కనిపించడం లేదని అఖిలపక్ష నేతలతో సీఎం ఉద్ధవ్ నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలుస్తోంది. నెల పాటు లాక్డౌన్ విధిస్తే పరిస్థితి పూర్తిగా అధీనంలోకి వస్తుందని సీఎం పేర్కొన్నారు. దీనికి అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ‘ఈ నెల 15 నుంచి 20 మధ్య పరిస్థితులు మరింత దుర్భరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం మినహా వేరే గత్యంతరమే కనిపించడం లేదు. కరోనా చైన్ను కచ్చితంగా తెంచాల్సిన అవసరం ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా దాడి చేస్తోంది.’’ అని సీఎం ఉద్ధవ్ వ్యాఖ్యానించారు.
50 వేల రెమిడేసివిర్ టీకాలు కావాలి : రాజేశ్ తోపే
అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతానికి 50 వేల రెమిడేసివిర్ టీకాలు కావాలని, నెలకు తక్కువలో తక్కువ లక్ష రెమిడేసివిర్ టీకాలు అవసరమవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్తో బ్లాక్మార్కెట్ వ్యాపారం జరుగుతోందని, దీన్ని ఆపడం చాలా ముఖ్యమని అఖిలపక్ష సమావేశంలో పేర్కొన్నారు. ముంబై, పూణే లాంటి నగరాల్లో ఆపడం చాలా కష్టమని, వీటి కోసం కొందరు ప్రైవేట్ ఆస్పత్రులను కూడా ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు. దీనిని ప్రభుత్వం తొందరగా కొనుగోలు చేయాలని, ఆక్సిజన్ నిల్వలను మరింత పెంచాలని సీఎం ఉద్ధవ్ కోరారు.