ఫేక్ న్యూస్‌తో అడ్డంగా బుక్ అయిన చైనీస్ మీడియా

ABN , First Publish Date - 2021-08-11T23:45:45+05:30 IST

బూటకపు వార్తలు రాసిన చైనా ప్రభుత్వ మీడియా సంస్థలు తీవ్రంగా

ఫేక్ న్యూస్‌తో అడ్డంగా బుక్ అయిన చైనీస్ మీడియా

బీజింగ్ : బూటకపు వార్తలు రాసిన చైనా ప్రభుత్వ మీడియా సంస్థలు తీవ్రంగా భంగపడ్డాయి. ఇవి తప్పుడు వార్తలని నిర్థరణ కావడంతో కంగు తిన్నాయి. కరోనా వైరస్ మూలాలపై దర్యాప్తును రాజకీయం చేస్తున్నారని ఓ స్విస్ బయాలజిస్ట్ వ్యాఖ్యానించారని ఈ మీడియా సంస్థలు రాశాయి. ఆ పేరుగలవారు ఎవరూ లేరని బీజింగ్‌లోని స్విట్జర్లాండ్ ఎంబసీ స్పష్టం చేయడంతో ఆ కథనాలను వెబ్‌సైట్ల నుంచి తొలగించాయి. 


పీపుల్స్ డైలీ, చైనా డైలీ అండ్ నేషనల్ బ్రాడ్‌కాస్టర్ వంటి చైనీస్ మీడియా సంస్థలు విల్సన్ ఎడ్వర్డ్స్ అనే స్విస్ బయాలజిస్ట్‌ ఫేస్‌బుక్ పోస్టులను ఉటంకిస్తూ కథనాలను ప్రచురించాయి. చైనా డైలీ ప్రచురించిన కథనానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతోంది. దీనిలో ‘‘ఆయన (విల్సన్ ఎడ్వర్డ్స్) తన ఫేస్ బుక్ ఖాతాలో ఇలా చెప్పారు : ‘కోవిడ్-19 మూలాల దర్యాప్తును ఏ విధంగా రాజకీయం చేస్తున్నారో ఓ బయాలజిస్టుగా నేను గత కొద్ది నెలలుగా దిగ్భ్రాంతితో చూస్తున్నాను’.’’ అని కనిపించింది. 


పీపుల్స్ డైలీ ఇంగ్లిష్ వెబ్‌సైట్‌లో కూడా విల్సన్ ఎడ్వర్డ్స్‌ను ఉటంకిస్తూ కథనాన్ని ప్రచురించారు. ‘‘ఓ యూరోపియన్ బయాలజిస్టు ఉలిక్కిపడే మాట చెప్పారు. మహమ్మారికి కారణమైన వైరస్ సహా, రోగ కారకాల మూలాల దర్యాప్తుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అడ్వయిజరీ గ్రూప్ ఓ రాజకీయ సాధనంగా మారిందని చెప్పారు’’ అని పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ స్వతంత్రత గురించి తనకు చాలా ఆందోళన కలుగుతోందని ఎడ్వర్డ్స్ జూలై 24న ట్విటర్, ఫేస్‌బుక్ సహా సామాజిక మాధ్యమాల్లో రాశారని పేర్కొంది. 


దీనిపై బీజింగ్‌లోని స్విస్ ఎంబసీ ట్విటర్ వేదికగా స్పందించింది. విల్సన్ ఎడ్వర్డ్స్ అనే పేరుగల పౌరుడు కానీ, బయాలజిస్ట్ కానీ తమకు కనిపించలేదని  తెలిపింది. ఎడ్వర్డ్స్ రాసిన విద్యా సంబంధిత వ్యాసాలు కూడా తమకు కనిపించలేదని పేర్కొంది. 


‘‘ఆరోపిత (స్విస్) బయాలజిస్ట్ విల్సన్ ఎడ్వర్డ్స్ కోసం చూస్తున్నాం... ఒకవేళ మీరు ఉంటే, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం. కానీ ఇది బూటకపు వార్త అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది’’ అని ట్వీట్ చేసింది. 


ఈ ట్వీట్‌తోపాటు జత చేసిన స్టేట్‌మెంట్‌లో చైనా ప్రజలను అప్రమత్తం చేసింది. ఓ స్విస్ బయాలజిస్ట్‌ను ఉటంకిస్తూ చైనాలో అనేక పత్రికా వ్యాసాలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వస్తున్నాయని తెలిపింది. తమ దేశంపై దృష్టిపడటం సంతోషకరమే అయినప్పటికీ, ఇది తప్పుడు వార్త అని చైనా ప్రజలకు చెప్పవలసి రావడం దురదృష్టకరమని తెలిపింది. ఈ కథనాలను సదుద్దేశంతో ప్రచురించినప్పటికీ, వీటిని తొలగించాలని, సవరణను ప్రచురించాలని కోరుతున్నట్లు వెల్లడించింది. 


విల్సన్ ఎడ్వర్డ్స్ పేరుతో జూలైలోనే ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ అయినట్లు తెలిపింది. దీనికి ముగ్గురు ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారని, దీనిని సోషల్ నెట్‌వర్కింగ్ పర్పస్ కోసం క్రియేట్ చేసినట్లుగా కనిపించడం లేదని పేర్కొంది. 


Updated Date - 2021-08-11T23:45:45+05:30 IST