అరుణాచల్ ప్రదేశ్ మాదే : చైనా

ABN , First Publish Date - 2021-12-31T23:49:41+05:30 IST

భారత దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోకుండా

అరుణాచల్ ప్రదేశ్ మాదే : చైనా

బీజింగ్ : భారత దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోకుండా అరుణాచల్ ప్రదేశ్ తమదేనని చైనా మరోసారి చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా పేర్కొంటూ బుధవారం తన మ్యాప్‌లో 15 ప్రాంతాల పేర్లను మార్చిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రానికి చైనీస్‌లో జంగ్నన్ అని పేరు పెట్టింది. 90 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంగల భూమి తనదేనని పేర్కొంది. జంగ్నన్‌లోని ప్రదేశాలకు చైనీస్ అక్షరాలు, రోమన్, టిబెటన్ అక్షరాల్లో ఈ పేర్లను రాసింది. 


అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా తన భాషలో పేర్లను మార్చినట్లు వస్తున్న వార్తల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించినపుడు భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందించారు. ఈ కథనాలను గమనించినట్లు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ గతంలో, ప్రస్తుతం, భవిష్యత్తులో ఎన్నటికీ భారత దేశంలో అంతర్భాగమేనని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు, ప్రదేశాలకు కొత్తగా కనిపెట్టిన పేర్లను పెట్టడం వల్ల ఈ యథార్థం మారబోదని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు, ప్రదేశాలకు చైనా పేర్లు పెడుతుండటం ఇదే మొదటిసారి కాదన్నారు. 2017 ఏప్రిల్‌లో కూడా ఇదే విధంగా ప్రయత్నించిందన్నారు. 


భారత దేశం స్పందనపై ప్రతిస్పందించాలని శుక్రవారం మీడియా కోరినపుడు చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ మాట్లాడుతూ, చైనా టిబెటన్ అటానమస్ రీజియన్‌కు చెందినదే దక్షిణ టిబెట్ అని, అది చైనా అంతర్భాగమని చెప్పారు. అనేక సంవత్సరాల నుంచి వివిధ వర్గాలకు చెందినవారు అక్కడ నివసిస్తున్నారని, ఆ ప్రాంతానికి వేర్వేరు పేర్లు పెట్టారని అన్నారు. ఆ ప్రాంతం ప్రామాణిక నిర్వహణ కోసం చైనాకు సంబంధించిన సమర్థ అధికారులు నిబంధనల ప్రకారం సంబంధిత ప్రాంతాలకు పేర్లు పెట్టినట్లు వివరించారు. 


చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ అక్టోబరు 23న ఆమోదించిన కొత్త సరిహద్దు చట్టం జనవరి నుంచి అమల్లోకి రాబోతోంది. చైనా భౌగోళిక సరిహద్దులను కాపాడుకోవడం కోసం ఈ చట్టాన్ని చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. 


Updated Date - 2021-12-31T23:49:41+05:30 IST