నా తల్లిదండ్రుల్ని కాపాడండి..సాయం కోసం యువతి వినతి
ABN , First Publish Date - 2021-05-13T17:23:11+05:30 IST
కరోనా వైరస్బారినపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన తల్లిదండ్రులను కాపాడుకునేందుకు ఓ యువతి సాయాన్ని అర్థిస్తోంది. గత నెలలో కరోనా వైరస్
చెన్నై/అడయార్: కరోనా వైరస్బారినపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన తల్లిదండ్రులను కాపాడుకునేందుకు ఓ యువతి సాయాన్ని అర్థిస్తోంది. గత నెలలో కరోనా వైరస్ తన సోదరుడుని చంపేసిందని, ఇప్పుడు తన తల్లిదండ్రుల అరోగ్యం విషమంగా ఉందని వారిని రక్షించుకునేందుకు తనకు రెమ్డెసివిర్ మందులు సమకూర్చి సాయం చేయాలని కోరింది. ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతాలో ఆ యువతి చేసిన పోస్టు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నగర శివారు ప్రాంతమైన ఆవడి సమీపంలోని పరుత్తిపట్టు ప్రాంతానికి చెందిన బాలకృష్ణన్ - షీలా అనే దంపతుల కుమార్తె ఐశ్వర్య దీనిని పోస్టు చేసింది. తన తల్లిదండ్రుల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అధికంగా వుండటంతో వీరి ఆరోగ్య పరిిస్థితి ఆందోళనకరంగావుందని, ప్రస్తుతం వీరు పట్టాభిరాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపిన ఐశ్వర్య... వైద్యులు రెమ్డెసివర్ మందులు వాడాలని సూచించారని చెప్పింది. తన శక్తిమేరకు ఆరు రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు సేకరించగలిగానని, మరో ఆరు రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు కావాలని వైద్యులు చెప్పారన్నారు. తన తల్లిదండ్రులను కాపాడుకునేందుకు ఈ మందులను ఎవరైనా సాయం చేయాలని ఆమె బోరున విలపిస్తూ వేడుకుంది.