బెయిల్ రద్దు ఖాయం
ABN , First Publish Date - 2021-08-10T09:42:55+05:30 IST
ఆర్థిక మోసగాళ్లుగా ముద్రపడిన ఏ-1 (సీఎం జగన్), ఏ-2ల(ఎంపీ విజయసాయిరెడ్డి) బెయిల్ సీబీఐ కోర్టులో రద్దు కావడం ఖాయమని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.
![బెయిల్ రద్దు ఖాయం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఏపీలో ఆర్టికల్ 360 విధించాలి : రఘురామ
న్యూఢిల్లీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక మోసగాళ్లుగా ముద్రపడిన ఏ-1 (సీఎం జగన్), ఏ-2ల(ఎంపీ విజయసాయిరెడ్డి) బెయిల్ సీబీఐ కోర్టులో రద్దు కావడం ఖాయమని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. వీరి ఆగడాలు, మోసాలు మరింత ఎక్కువయ్యాయని సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు. ‘‘న్యాయమూర్తులను, న్యాయస్థానాలను తూలనాడుతూ, న్యాయ వ్యవస్థను కించపరిచేలా సొషల్మీడియాలో పోస్టులు పెట్టిన వారికి ‘మీకు నేనున్నాను. ఏమీకాదు’ అంటూ విజయసాయి అభయం ఇచ్చారు. న్యాయవ్యవస్థలను దూషించినవారిపై విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు, విజయసాయిరెడ్డిని కూడా విచారించాలి. న్యాయ వ్యవస్థను తూలనాడిన వారికి అభయం ఏ-1 ఇస్తున్నారా? ఏ-2 ఇస్తున్నారా? వీరిద్దరూ ఇస్తున్నారా? ఇంతకీ వీరిలో బిగ్ బాస్ ఎవరు?’’ అని రఘురామ ప్రశ్నించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో విజయసాయిరెడ్డిని సీబీఐ విచారించాలని రఘురామ డిమాండ్ చేశారు. రాష్ట్రం దివాలాదిశగా నడుస్తోందని, తక్షణమే ఆర్టికల్ 360 ప్రయోగించి, ఆర్ధిక అత్యవసర పరిస్థితిని విధించాలని డిమాండ్ చేశారు.