కేంద్ర బడ్జెట్ 2021-22 కీలకాంశాలు - LIVE
ABN , First Publish Date - 2021-02-01T16:48:09+05:30 IST
కేంద్ర బడ్జెట్ 2021-22 కీలకాంశాలు - LIVE

1:59 PM 2/1/2021
లీటర్ పెట్రోల్పై రూ.2.50, లీటర్ డిజిల్ పై రూ. 4 సెస్ విధించనున్నారు. అయితే ఈ విషయాన్ని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. డీజిల్పై అగ్రి ఇన్ఫ్రా సెస్ను కేంద్రం విధించనుంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని, సామాన్యులపై ప్రభావం ఉండదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
1:44 PM 2/1/2021
ట్యాక్స్ శ్లాబ్ల్లో ఎలాంటి మార్పు లేదని ఆర్థికమంత్రి చెప్పారు. మొబైల్ రేట్లు పెరిగగా, నైలాన్ దుస్తుల ధరలు తగ్గే అవకాశం ఉంది. పన్ను చెల్లింపు ప్రక్రియ సరళీకరణకు మరిన్ని చర్యలు చేపట్టనున్నట్టు నిర్మల తెలిపారు. ఎన్ఆర్ఐలకు డబుల్ ట్యాక్సేషన్ నుంచి ఊరటనిచ్చారు. ఇంపోర్టెడ్ దుస్తులు మరింత ప్రియం కానున్నాయి. సోలార్ ఇన్వర్టర్లపై పన్ను పెరగనుంది. బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి.
1:39 PM 2/1/2021
ఐటీ రిటర్న్ దాఖలకు మినహాయింపులు ఇచ్చింది. 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఊరటనిచ్చింది. పింఛన్, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు కల్పించింది. ప్రధాని ఆవాస్ యోజన మరో ఏడాది పొడిగిస్తున్నట్టు తెలిపింది. గృహరుణాల రాయితీ పథకం మరో ఏడాది పొడిగిస్తున్నట్టు తెలిపింది.
1:37 PM 2/1/2021
గోవా డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు రూ.300 కోట్లు కేటాయించింది కేంద్రం. సామాజిక భద్రతా పధకాల్లో వీధి వ్యాపారులను చేరుస్తున్నట్టు తెలిపింది. అంకుర సంస్థల ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు తెలిపింది. జాతీయ అంప్రెంటీస్ చట్టానికి సవరణలు చేయనున్నట్టు తెలిపింది. యువతకు అవకాశాలు పెంచేలా కొత్త సవరణలు తీసుకురానున్నట్టు తెలిపింది. డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహం కోసం రూ. 1500 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపింది.
1:33 PM 2/1/2021
దేశవ్యాప్తంగా మరో 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గిరిజన విద్యార్థుల కోసం కొత్తగా 750 ఏకలవ్య పాఠశాలలు, లేహ్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 32 రాష్ట్రాల్లో వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు అమలు చేస్తున్నట్టు తెలిపారు. అన్ని రంగాల్లో కార్మికులకు కనీస వేతనాలు వర్తించేలా చేస్తాం. సోలార్ పవర్కు రూ. వెయ్యి కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
1:31 PM 2/1/2021
బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది కేంద్రం. బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎన్పీఏలు- మొండిబకాయిలు బ్యాడ్ బ్యాంక్లకు తరలిస్తున్నట్టు తెలిపారు. బ్యాంకుల ఖాతాలను సజావుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు.
1:27 PM 2/1/2021
రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి నిర్మల తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల ఉందన్నారు. మద్దతు ధర కింద గోధుమ రైతులకు గత ఆర్థిక సంవత్సరంలో 75 వేల కోట్లు కేటాయించామని, కనీస మద్దతు ధరకు లక్షా 72 వేల కోట్లు కేటాయించామన్నారు. వ్యవసాయ రుణాల లక్ష్యం 16.5 లక్షల కోట్లుగా ప్రకటించారు. 40 వేల కోట్లతో గ్రామీణ మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వెయ్యి మండీలను ఈనామ్తో అనుసంధానం చేయనున్నట్టు తెలిపారు.
12:32 PM 2/1/2021
విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురానున్నట్టు నిర్మల తెలిపారు. విద్యుత్ పంపిణీ రంగంలో మరిన్ని పంపిణీ సంస్థలు తీసుకురానున్నట్టు తెలిపారు. రూ.3,05,984 కోట్లతో డిస్కమ్లకు సాయం అందిస్తున్నట్టు తెలిపారు. హైడ్రోజన్ ఎనర్జీపై దృష్టి పెట్టనున్నట్టు చెప్పారు. ఇండియన్ షిప్పింగ్ కంపెనీకి రూ.1,624 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. నౌకల రీసైక్లింగ్ సామర్థ్యం పెంచుతున్నట్టు చెప్పారు. 15వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం కేంద్ర పథకాల హేతుబద్ధీకరిస్తున్నట్టు తెలిపారు. 2021-22లో బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, ఐడీబీఐల అమ్మకం పూర్తి కానున్నట్టు తెలిపారు.
12:28 PM 2/1/2021
27 సిటీలకు మెట్రో విస్తరణ
చైన్నై మెట్రో ఫేజ్-2కు రూ.63,246 కోట్లు
బెంగళూరు మెట్రోకు రూ.14,788 కోట్లు
కొచ్చి మెట్రో ఫేజ్-2కు రూ.1,957 కోట్లు
రూ.18 వేల కోట్లతో బస్ ట్రాన్స్ పోర్ట్ పథకం
మెట్రో న్యూ, మెట్రో లైట్ పేరుతో కొత్త ప్రాజెక్టులు
12:17 PM 2/1/2021
మరో కోటి మంది లబ్ధిదారులకు ఎల్పీజీ ఉజ్వల్ యోజనను అందుబాటులో తీసుకురానున్నట్టు తెలిపారు. వచ్చే మూడేళ్లలో 100 జిల్లాలకు గ్యాస్ పైప్లైన్లు అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. మూలధనం సహాయం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 20వేల కోట్లు అందించనున్నట్టు తెలిపారు.
12:15 PM 2/1/2021
షౌష్టికాహారం అందరికీ అందించేందుకు మిషన్ పోషణ్ 2.0 చేపట్టనున్నట్టు తెలిపారు. రూ.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థ లక్ష్యం చేరాలంటే రెండంకెల వృద్ధి తప్పనిసరి చేయనున్నారు. 13 రంగాల్లో పీఎల్ఐ ప్రోత్సాహకాల కోసం ఖర్చుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఐదేళ్లలో స్వచ్ఛభారత్ 2.0 కోసం రూ.1,41,678 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
12:11 PM 2/1/2021
1938 బీమా చట్టానికి సవరణలు చేస్తున్నట్టు తెలిపారు. బీమా కంపెనీల్లో ఎఫ్డీఐల పరిమితి 74 శాతానికి పెంచినట్టు తెలిపారు. ఎఫ్డీఐల పరిమితి 49 శాతం నుంచి 74 శాతానికి పెంచారు. పలు సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. గెయిల్, ఐవోసీ, హెచ్పీసీఎల్ పైప్లైన్లలో పెట్టుబడుల ఉపసంహరిస్తున్నట్టు చెప్పారు. జాతీయస్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ పర్యవేక్షణకు ప్రత్యేక డ్యాష్బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. 2 ప్రభుత్వ బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయించినట్టు తెలిపారు. జనరల్ ఇన్యూరెన్స్ కంపెనీలో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
11:55 AM 2/1/2021
ఎన్నికలు జరగబోయే తమిళనాడు, బెంగాల్ పై బడ్జెట్ సందర్భంగా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. తమిళనాడులో 1,03 లక్షల కోట్లతో నేషనల్ హైవే నిర్మిస్తున్నారు. దీనిని ఎకనామిక్ కారిడార్గా మారుస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక కేరళలో కూడా 65 వేల కోట్లతో నేషనల్ హైవేను నిర్మిస్తామని పేర్కొన్నారు. ముంబై - కన్యాకుమారి మధ్య కూడా ఎకనామిక్ కారిడార్ను నిర్మిస్తామని తెలిపారు. ఇక పశ్చిమ బెంగాల్ - సిరిగురి మధ్య నేషనల్ హైవేను నిర్మిస్తామని ప్రకటించారు. మరో మూడేళ్లలో అసోంలో కూడా ఎకనామిక్ కారిడార్తో పాటు నేషనల్ హైవేలను కూడా నిర్మిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
11:53 AM 2/1/2021
ఈ ఏడాది రైల్వేలకు రూ. 1.10 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల తెలిపారు. 2023 నాటికి రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తి చేయనున్నట్టు చెప్పారు. 2030 నాటికి రైల్వేలకు కొత్త రూపు తీసుకురానున్నట్టు పేర్కొన్నారు. టైర్-2, టైర్-3 సిటీస్లో ప్రైవేటుగా ఎయిర్పోర్టులు నిర్మిస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా వెయ్యి మార్కెట్లలో ఆన్లైన్ వ్యవస్థను తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల చెప్పారు.
11:49 AM 2/1/2021
తయారీ రంగం మద్దతు కోసం ప్రత్యేక ఆర్థిక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ కోసం రూ.20 వేల కోట్ల మూలధనం కేటాయించనున్నట్టు తెలిపారు. వచ్చే మూడేళ్లలో అందుబాటులోకి రూ.5 లక్షల కోట్ల రుణాలు తీసుకురానున్నట్టు తెలిపారు.
11:48 AM 2/1/2021
కొత్తగా 13వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. పశ్చిమబెంగాల్లో రూ.25 వేల కోట్లతో 675 కి.మీ హైవేల అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. అసోంలో రూ.19 వేల కోట్లతో హైవేల అభివృద్ధి చేపట్టనున్నట్టు తెలిపారు. కేరళలో 1100 కిలో మీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. 2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమలో సరకు రవాణా కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఖరగ్పూర్- విజయవాడ మధ్య ఈస్ట్- కోస్ట్ సరకు రవాణా కారిడార్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
11:47 AM 2/1/2021
కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. మెగా టెక్స్టైల్ ఇన్వెస్ట్మెంట్ పార్కుల ఏర్పాటు చేయనున్నామన్నారు. వచ్చే మూడేళ్లలో ఏడు టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. వాయుకాలుష్య నివారణకు రూ.2,217 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
ఈ బడ్జెట్లో ఆరు ప్రాధామ్యాలను ఎంచుకున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి చెప్పారు. తొలి ప్రాధాన్యంగా వైద్యారోగ్యం, రెండో ప్రాధాన్యంగా మౌలిక రంగం, మూడో ప్రాధ్యానత సమ్మిళిత అభివృద్ధి అని, నాల్గొవ ప్రాధ్యానత మానవ వనరులు, నైపుణ్య అభివృద్ధి, ఐదో ప్రాధ్యానత ఇన్నోవేషన్ అండ్ ఆర్ ఎండ్ డీగా పేర్కొన్నారు.
11:42 AM 2/1/2021
కొత్తగా 9 బీఎస్ఎల్-3 స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి కోసం ప్రధాని ‘జల్జీవన్ మిషన్ అర్బన్’ తీసుకురానున్నట్టు తెలిపారు. రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87 వేల కోట్లు కేటాయించామన్నారు. దేశంలో 2 కోట్ల 18 లక్షల ఇళ్లకు మంచినీరు, స్వచ్ఛ భారత్ మిషన్కు లక్షా 41 వేల 678 కోట్లు కేటాయించామన్నారు. రూ.87 వేల కోట్లతో 500 నగరాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఘనవ్యర్థాల నిర్వహణ కోసం స్వచ్ఛభారత్ అర్బన్ తీసుకురానున్నట్టు తెలిపారు. తుక్కు వాహనాల రద్దు, అధునాతన వాహనాల వినియోగం, 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలను తుక్కుగా మార్చే పథకాన్ని తీసుకువస్తున్నట్టు తెలిపారు.
11:37 AM 2/1/2021
ఆత్మనిర్భర్ భారత్లో రూ.21.17 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈదేశం మూలాల్లోనే ఆత్మనిర్భర్ భావం ఉందని, ఆరోగ్యవంతమైన భారతదేశం కోసం కృష్టి చేస్తామన్నారు. ఆరోగ్య రంగంలో రూ.64, 180 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రూ.64, 180 కోట్లతో పీఎం ఆత్మనిర్భర ఆరోగ్య పథకం తీసుకురానున్నట్టు తెలిపారు. నివారణ, చిక్సిత, సంపూర్ణ ఆరోగ్య విధానంలో పథకం ఉండనుందన్నారు.
11:34 AM 2/1/2021
కోవిడ్ యోధులందరికీ నిర్మలా సీతారామన్ కృతజ్ఞతలు తెలిపారు. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిపై ప్రభావం పడిందన్నారు. ఇప్పుడు కరోనా తర్వాత కూడా మనం మరో కొత్త ప్రపంచంలో ఉన్నామన్నారు.
11:30 AM 2/1/2021
పట్టణాల్లో నీటి సమస్య పరిష్కారానికి జల్ జీవన్ అభియాన్ తీసుకురానున్నట్టు తెలిపారు. పదిలక్షలకు పైగా జనాభా కలిగిన పట్టణాల్లో కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టునున్నామన్నారు. 20ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలపై నిషేధం విధించనున్నట్టు తెలిపారు. అధునాతన వాహనాల వినియోగానికి ప్రోత్సాహకాలలు అందించనున్నట్టు తెలిపారు.
11:22 AM 2/1/2021
రూ.64,180 కోట్లతో స్వస్థ భారత్ యోజన తీసుకురానున్నట్టు తెలిపారు. దాదాపు వందదేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ సప్లై చేశామన్నారు. ఆర్థికాభివృద్ధికి వ్యాక్సినేషన్ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ఆస్ట్రేలియాలో టీమిండియా గెలిచినట్లు మన ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.
11:14 AM 2/1/2021
ఆర్ధిక మంత్రి నిర్మల లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. తొలిసారి పేపర్లెస్ ప్రవేశపెట్టారు. ట్యాబ్లో చూసి బడ్జెట్ చదువుతున్నారు.