మోదీజీ.. మీ సంజీవని అందింది
ABN , First Publish Date - 2021-01-24T07:58:23+05:30 IST
కరోనాతో కుదేలవుతున్న బ్రెజిల్కు భారత్ నుంచి ఆపన్నహస్తం అందింది. మన దేశం పంపిన 20 లక్షల డోసుల కొవిషీల్డ్ టీకాలు శుక్రవారం బ్రెజిల్ చేరాయి...
- బ్రెజిల్కు కరోనా వ్యాక్సిన్.. అధ్యక్షుడి కృతజ్ఞతలు
న్యూఢిల్లీ, జనవరి 23: కరోనాతో కుదేలవుతున్న బ్రెజిల్కు భారత్ నుంచి ఆపన్నహస్తం అందింది. మన దేశం పంపిన 20 లక్షల డోసుల కొవిషీల్డ్ టీకాలు శుక్రవారం బ్రెజిల్ చేరాయి. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో భారత ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రామాయణంలో హనుమంతుడు ‘సంజీవని’ మూలికను ఎత్తుకొస్తున్న ఇల్లస్ట్రేషన్ చిత్రాన్ని బొల్సొనారో ట్వీట్ చేశారు. చిత్రంలో హనుమంతుడు మోస్తున్న పర్వతంపై వయల్, సిరంజీ ఉండటం గమనార్హం. అంతేకాక, ఢిల్లీ నుంచి టీకాలు బ్రెజిల్ రాజధాని బ్రసీలియా చేరుతున్నట్లు మార్గాన్ని చూపారు. శుక్రవారం మొరాకోకూ భారత్ టీకాలు పంపింది. మరోవైపు భారత్ నుంచి వచ్చే వారం శ్రీలంకకు ఉచితంగా టీకాలు సరఫరా కానున్నాయి. 27వ తేదీన టీకాలు అందనున్నట్లు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స శనివారం వెల్లడించారు. లంక.. చైనా, రష్యా నుంచి టీకాలను కొనుగోలు చేస్తోంది.