సీఎం అభ్యర్థి ఎవరన్నది ఇప్పుడే ప్రకటించం : అసోం బీజేపీ
ABN , First Publish Date - 2021-03-09T02:01:12+05:30 IST
ఎన్నికల కంటే ముందే తాము సీఎం అభ్యర్థిని ప్రకటించమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రంజిత్ కుమార్ దాస్ ప్రకటించారు.
గౌహతి : ఎన్నికల కంటే ముందే తాము సీఎం అభ్యర్థిని ప్రకటించమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రంజిత్ కుమార్ దాస్ ప్రకటించారు. సీఎం ఎవరన్నది పార్లమెంటరీ బోర్డ్ కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. అయితే ఇదే విషయాన్ని సీఎం శర్వానంద సోనోవాలా, మంత్రి హిమవంత విశ్వాస శర్మ కూడా ప్రకటించడం గమనార్హం. అయితే 2016 ఎన్నికల ముఖచిత్రంతో పోలిస్తే ఇది భిన్నం. ఆ సమయంలో శర్వానంద సోనోవాలాయే ముఖ్యమంత్రి అని బీజేపీ ఎన్నికల కంటే ముందే ప్రకటించింది. ఆయన సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లింది. అయితే దీనిపై బీజేపీ అధ్యక్షుడు వివరణ ఇచ్చారు. ‘‘అప్పట్లో మేము ప్రభుత్వంలో లేము. అందుకే సీఎం పేరును ప్రకటించాం. ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం. అందుకే సీఎం అభ్యర్థిని ప్రకటించడం లేదు. ఈ విషయంపై ఏ బీజేపీ కార్యకర్త కూడా అడగలేదు. కేవలం మీడియా మాత్రమే అడుగుతోంది.’’ అని బీజేపీ అధ్యక్షుడు రంజిత్ కుమార్ రుసరుసలాడారు.