బెంగాల్ బీజేపీ ఎంపీ అర్జున్సింగ్కు జడ్ కేటగిరి భద్రత
ABN , First Publish Date - 2021-09-15T23:11:25+05:30 IST
పశ్చిమబెంగాల్ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్కు కేంద్ర ప్రభుత్వం 'జడ్' కేటగిరి భద్రతను
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్కు కేంద్ర ప్రభుత్వం 'జడ్' కేటగిరి భద్రతను కేటాయించింది. ఈ మేరకు హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెనువెంటనే ఆయన సీఐఎస్ఎఫ్ భద్రతా కవరేజ్లోకి వచ్చారు. ఉత్తర పరగణాల జిల్లా బారక్పూర్లో ఉన్న అర్జున్ సింగ్ నివాసంపై గత వారం రోజుల్లో రెండుసార్లు బాంబు దాడులు జరిగాయి. సెప్టెంబర్ 8న తొలిసారి జరిగిన నాటుబాంబుల దాడిలో పలువురికి స్వల్ప గాయాలయ్యారు. మంగళవారం మరోసారి ఆయన నివాసంపై కొందరు బాంబులు రువ్వారు. ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న అర్జున్ సింగ్ తన ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. ఈ దాడుల వెనుక టీఎంసీ మనుషులే ఉన్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గం పరిశీలకుడిగా బీజేపీ తనను నియమించిన మరుసటి రోజు ఉదయమే తన నివాసంపై దాడి జరిగిందని ఆయన మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనకు కేంద్ర హోం శాఖ 'జడ్' కేటగిరి భద్రత కల్పిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ దాడి అర్జున్ సింగ్ సృష్టేనని, తమపై చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని టీఎంసీ ప్రకటించింది.