బీజేపీ ఇకనైనా మేలుకోవాలి.. ట్రాక్టర్ పరేడ్ హింసపై స్వామి సంచలన వ్యాఖ్యలు...

ABN , First Publish Date - 2021-01-27T19:13:36+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణలు తలెత్తడంపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి తన ...

బీజేపీ ఇకనైనా మేలుకోవాలి.. ట్రాక్టర్ పరేడ్ హింసపై స్వామి సంచలన వ్యాఖ్యలు...

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రైతులు, పోలీసుల మధ్య తలెత్తిన ఘర్షణలపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి తనదైన శైలిలో స్పందించారు. బీజేపీ నేతలు ఇకనైనా ‘‘మేలుకోవాలంటూ’’ ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన  ఇవాళ ఉదయం ట్విటర్‌లో వరుస పోస్టులు పెట్టారు. ట్రాక్టర్ పరేడ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై ఉన్న ‘‘బలవంతులు’’ అనే ముద్రకు నష్టం వాటిల్లిందని స్వామి అన్నారు. ‘‘రైతుల ఆందోళన కారణంగా ప్రధానంగా ఇద్దరు భాగస్వాముల గౌరవం దెబ్బతిన్నది. ఒకటి, పంజాబ్ కాంగ్రెస్, అకాలీ రాజకీయ నేతలు, వారి మధ్యవర్తులు. రెండోది, మోదీ- షా ‘‘బలవంతులు’’ అనే ముద్ర. లాభపడింది ఎవరు అంటే.. నక్సలైట్లు, డ్రగ్స్ ముఠాలు, ఐఎస్ఐ, ఖలిస్తానీలు. దయచేసి ఇకనైనా బీజేపీ మేలుకోవాలి..’’ అని స్వామి ట్వీట్ చేశారు.


ఢిల్లీలో శాంతి భద్రతల ‘‘వైఫల్యం’’పైనా స్వామి విమర్శలు సంధించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను నిలిపివేయాలని తాను ముందుగానే అనేక మార్లు కేంద్రాన్ని కోరానని ఆయన గుర్తుచేశారు. ‘‘భారత్‌ను మరింత బలహీనం చేసేందుకు ఈ మార్చి- మేలో చైనా భారీ దాడి చేయవచ్చు. హిందువులను ముట్టడి వేశారు జాగ్రత్త.. ఇకనైనా మేలుకొండి..’’ అని ఆయన హెచ్చరించారు. రైతుల ఆందోళన కారణంగా ఈ ఏడాది గణతంత్ర వేడుకలు రసాభాసగా మారిన విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు... ట్రాక్టర్ పరేడ్ పేరుతో తాజాగా ఢిల్లీ పురవీధుల్లోకి దూసుకెళ్లడంతో ఇక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.



Updated Date - 2021-01-27T19:13:36+05:30 IST