కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు : భారత్ బయోటెక్
ABN , First Publish Date - 2021-04-20T22:51:00+05:30 IST
కోవిడ్-19 నిరోధక వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర
న్యూఢిల్లీ : కోవిడ్-19 నిరోధక వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు భారత్ బయోటెక్ మంగళవారం ప్రకటించింది. సంవత్సరానికి 700 మిలియన్ల డోసుల కోవాగ్జిన్ను ఉత్పత్తి చేసేందుకు వీలుగా సామర్థ్యాన్ని విస్తరించినట్లు తెలిపింది. బెంగళూరు, హైదరాబాద్లలోని ప్లాంట్లలో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచినట్లు వివరించింది.
భారత్ బయోటెక్కు గత వారం కేంద్ర ప్రభుత్వం రూ.65 కోట్ల గ్రాంట్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సోమవారం సీరం ఇన్స్టిట్యూట్కు రూ.3,000 కోట్లు; భారత్ బయోటెక్కు రూ.1,500 కోట్లు అడ్వాన్స్ను ఆమోదించింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను రెండు, మూడు నెలల్లో సరఫరా చేయడం కోసం అడ్వాన్స్గా ఈ నిధులను సమకూర్చింది.
ప్రస్తుతం భారత్ బయోటెక్ నెలకు 4 మిలియన్ల కోవాగ్జిన్ డోసులను ఉత్పత్తి చేస్తోంది. పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్ నెలకు 60 మిలియన్ డోసుల కోవిషీల్డ్ను ఉత్పత్తి చేస్తోంది.