అవన్నీ ఉద్దేశపూర్వక కథనాలే : Ashwini Vaishnaw
ABN , First Publish Date - 2021-07-19T21:54:33+05:30 IST
పాత్రికేయులు, నేతలు, మేధావుల ఫోన్లను ‘పెగాసస్’ హ్యాక్ చేసిందంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ : పాత్రికేయులు, నేతలు, మేధావుల ఫోన్లను ‘పెగాసస్’ హ్యాక్ చేసిందంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఈ సంచలన ఆరోపణల వెనుక ఎలాంటి వాస్తవమైన ఆధారాలు లేవని లోక్సభలో స్పష్టం చేశారు. పెగాసస్ స్పైవేర్ను ఇలాంటి వాటికి కూడా వాడుతున్నారన్న దానిపై ఎలాంటి సాక్ష్యాధారాలు కూడా లేవని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ఠ పాలుజేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలోనూ ఇలాంటి ఆరోపణలే తెరపైకి వచ్చాయని గుర్తు చేశారు. ఈ రిపోర్టులకు ఎలాంటి హేతుబద్ధమైన ఆధారాలేవని అన్ని పార్టీలూ తోసిపుచ్చాయని కూడా అశ్వినీ వైష్ణవ్ గుర్తు చేశారు. పార్లమెంట్ సమావేశాలకు ఒక రోజు ముందు ఇలాంటి కథనం రావడం యాదృచ్చికం కాదని అన్నారు.
దాదాపు 18 నెలల తర్వాత ఆ ‘పెగాసస్’ స్పైవేర్ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. 40 మందికి పైగా భారతీయ పాత్రికేయులు, విపక్షాలకు చెందిన ముగ్గురు అతి పెద్ద నేతలు, రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక వ్యక్తి, ప్రస్తుత మోదీ సర్కారులోని ఇద్దరు మంత్రులు, వివిధ భద్రతా సంస్థలకు చెందిన మాజీ, ప్రస్తుత అధిపతు లు, పలువురు వ్యాపారవేత్తలు.. ఇలా మొత్తం 300 మంది పెగాసస్ ‘నిఘా’ జాబితాలో ఉన్నారంటూ ‘ద వైర్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. జాబితాలో ఉన్న ఒక నంబరు సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి పేరుతో నమోదై ఉందని.. అయితే, ఆయన ఆ నంబరును ఉపయోగిస్తున్నదీ లేనిదీ తెలియదని పేర్కొంది.
ఆ జాబితాలో ఉన్న 10 మంది పాత్రికేయుల ఫోన్లకు ఫోరెన్సిక్ పరీక్షలు చేయించగా.. కొన్ని ఫోన్లు పెగాసస్ స్పైవేర్తో హ్యాక్ అయ్యాయని, కొన్నిటిపై హ్యాకింగ్కు ప్రయత్నించిన ఆనవాళ్లు ఉన్నాయని వెల్లడించింది. ఫ్రాన్స్కు చెం దిన ఫర్బిడెన్ స్టోరీస్ అనే స్వచ్ఛంద మీడియా సంస్థ, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ జాబితాను సంపాదించి ‘ద వైర్’ సహా ప్రపంచవ్యాప్తంగా 15 వార్తాసంస్థలకు ఇచ్చినట్టు కథనంలో పేర్కొంది.