పంతం వదిలిన బాబాయ్ అబ్బాయ్.. SP, PSP మధ్య పొత్తు
ABN , First Publish Date - 2021-12-16T23:38:48+05:30 IST
అప్పటి నుంచి ఆయన ఎస్పీకి ములాయం కుటుంబానికి దూరంగానే ఉంటూ వచ్చారు. అయితే తాజాగా శివపాల్ ఇంటికి అఖిలేష్ స్వయంగా వెళ్లి బాబాయ్తో పొత్తు ఏర్పాటు చేసుకొని రావడం గమనార్హం. ఈ విషయాన్ని అఖిలేష్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు..
లఖ్నవూ: ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ పొత్తులతో దూసుకుపోతోంది. ఇప్పటికే ఎస్బీఎస్పీ, ఆర్ఎల్డీ లాంటి పార్టీలతో పొత్తు కుదుర్చుకున్న ఎస్పీ అధినేత అఖిలేష్.. తాజాగా మరో పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. అయితే ఈ పొత్తు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది. కారణం, తన కారణంగానే సమాజ్వాదీ పార్టీ నుంచి వేరు పడి సొంతంగా ప్రగతిశీల సమాజ్వాదీ అనే పార్టీని ఏర్పాటు చేసుకున్న సొంత బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్తో అఖిలేష్ పొత్తు ఏర్పాటు చేసుకోవడం.
పార్టీ పగ్గాలు అప్పగించే విషయంలో అన్న ములాయం సింగ్ యాదవ్తో తమ్ముడు శివపాల్ సింగ్ యాదవ్ పెద్ద యుద్ధమే చేశాడు. అయితే ములాయం మాత్రం తమ్ముడి వైపు కాకుండా కొడుకు వైపే మొగ్గు చూపి, అఖిలేష్కు పార్టీ పగ్గాలు అప్పగించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన శివపాల్.. ఎస్పీని వదిలి ప్రగతిశీల సమాజ్వాదీ అనే కొత్త పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఎస్పీకి ములాయం కుటుంబానికి దూరంగానే ఉంటూ వచ్చారు. అయితే తాజాగా శివపాల్ ఇంటికి అఖిలేష్ స్వయంగా వెళ్లి బాబాయ్తో పొత్తు ఏర్పాటు చేసుకొని రావడం గమనార్హం. ఈ విషయాన్ని అఖిలేష్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.