అప్పుడు హోం మంత్రి ఆసుపత్రిలో ఉన్నారు: పవార్
ABN , First Publish Date - 2021-03-22T19:56:05+05:30 IST
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై అవినీతి ఆరోపణలు చేస్తూ ముంబై మాజీ పోలీస్ చీఫ్ పరమ్ బీర్ సింగ్ రాసిన లేఖ తప్పుల ...
![అప్పుడు హోం మంత్రి ఆసుపత్రిలో ఉన్నారు: పవార్](https://media.andhrajyothy.com/appimg/galleries/2021032202224516/03222021142519n53.jpg)
ముంబై: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై అవినీతి ఆరోపణలు చేస్తూ ముంబై మాజీ పోలీస్ చీఫ్ పరమ్ బీర్ సింగ్ రాసిన లేఖ తప్పుల తడకగా ఉందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆరోపించారు. అనిల్ దేశ్ముఖ్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ముంబైలోని బార్లు, రెస్టారెంట్లు సహా ఇతర సంస్థల నుంచి డబ్బులు వసూలు చేయాలని పోలీస్ అధికారులపై హోంమంత్రి దేశ్ముఖ్ ఒత్తిడి తెచ్చేవారంటూ సింగ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకి లేఖ రాయడంతో తీవ్ర దుమారం రేగింది. ‘‘ఒక్కసారి మాజీ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ లేఖ చూడండి. ఫిబ్రవరి మధ్యలో పోలీస్ అధికారులకు హోంమంత్రి నుంచి అలాంటి ఆదేశాలు వెళ్లాయంటూ ఆయన రాశారు. కానీ ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా దేశ్ముఖ్ ఆస్పత్రిలో చేరారు. ఫిబ్రవరి 15 నుంచి 27 వరకు ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు...’’ అని పవార్ పేర్కొన్నారు. దేశ్ముఖ్ విషయంలో అన్నీ ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఆయనను రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంలో అర్థం లేదని ఆయన అన్నారు.