Air India విమానం ల్యాండింగ్ గేర్లో లోపం...అత్యవసర ల్యాండింగ్
ABN , First Publish Date - 2021-11-10T16:31:08+05:30 IST
అసోం రాష్ట్రంలోని సిల్చార్ నుంచి బుధవారం బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ గేర్ లలో ఒకటి పనిచేయక పోవడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు....
సిల్చార్ (అసోం): అసోం రాష్ట్రంలోని సిల్చార్ నుంచి బుధవారం బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ గేర్ లలో ఒకటి పనిచేయక పోవడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. బుధవారం ఉదయం విమానం టేకాఫ్ అయిన వెంటనే దాని వెనుక చక్రాల్లో ఒక దానిలో చిక్కుకోవడం గమనించిన పైలెట్ వెంటనే ల్యాండింగ్ చేశారు. కుంభ్ గ్రామ్ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ ఎ319 విమానం కోల్కతాకు పూర్తి సామర్ధ్యపు ప్రయాణికులతో బయలుదేరింది. విమానంలో చిన్న లోపం వల్ల దాన్ని తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
అంతకుముందు అక్టోబర్ 22వతేదీన ఢిల్లీకి బయలుదేరిన విస్తారా విమానాన్ని మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని దేవి అహల్యాబాయి హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు మళ్లించారు. ఒక ప్రయాణికుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో స్పృహ కోల్పోవడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు విమానాశ్రయ అధికారి తెలిపారు.ఈ ఏడాది జూన్లో తిరువనంతపురం నుంచి సౌదీ అరేబియాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం విండ్షీల్డ్లో పగుళ్లు ఏర్పడినట్లు పైలట్లు గుర్తించినప్పుడు గంట కంటే తక్కువ సమయం గాలిలో ఉండి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.