కొవిడ్ నివారణకు అన్నాడీఎంకే భారీ విరాళం
ABN , First Publish Date - 2021-05-18T18:09:21+05:30 IST
కొవిడ్- ఉపద్రవంతో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై
- ఎంపీ, ఎమ్మెల్యేల నెల వేతనం కూడా
చెన్నై/ప్యారీస్ : కొవిడ్- ఉపద్రవంతో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతిపక్ష అన్నాడీఎంకే మద్దతు పలికింది. కొవిడ్ నివారణ చర్యలకు పార్టీ తరఫున రూ. కోటి విరాళం ప్రకటించింది. అలాగే, అన్నాడీఎంకే పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యే లు తమ ఒక నెల జీతం కూడా కరోనా నివారణ నిమిత్తం విరాళంగా ప్రభుత్వానికి అందజేయనుంది.
ఈ మేరకు అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్సెల్వం, ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి సంయుక్తంగా సోమవారం ప్రకటించారు. దీనిపై వారు విడుదల చేసిన ప్రకటనలో, కరోనా మహమ్మారితో రాష్ట్రప్రజలు తల్లడిల్లిపోతున్నారని, ప్రజలకు వైద్య సౌకర్యాలు కల్పించేందుకు, తగిన సాయం అందించేందుకు అన్నాడీఎంకే తరఫున సీఎం నివారణ నిధికి రూ. కోటి, తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల ఒక నెల వేతనం విరాళంగా అందజేయనున్నట్లు తెలిపారు. 2020వ సంవత్సరంలో కరోనా వైరస్ రాష్ట్రంలో ప్రవేశించిన నేపథ్యంలో కూడా కరోనా నివారణ చర్యలకు తమ పార్టీ రూ. కోటి విరాళం ప్రభుత్వానికి అందించిందని గుర్తుచేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కొవిడ్ బాధితుల కుటుంబాలకు తమ వంతు సహాయం చేసి ఆదుకోవాలని వారు పిలుపునిచ్చారు.