పినరయి సర్కారుకు ఎదురుదెబ్బ
ABN , First Publish Date - 2021-04-17T07:43:05+05:30 IST
కేరళలో వామపక్ష ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బంగారం అక్రమ రవాణా కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన రెండు కేసులను కేరళ హైకోర్టు కొట్టేసింది.
కోచి, ఏప్రిల్ 16: కేరళలో వామపక్ష ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బంగారం అక్రమ రవాణా కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన రెండు కేసులను కేరళ హైకోర్టు కొట్టేసింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వాలంటూ బంగారం అక్రమ రవాణా నిందితులపై ఈడీ అధికారులు ఒత్తిడి తెస్తున్నారంటూ రాష్ట్ర పోలీసులు కేసులను నమోదు చేశారు. ముఖ్యమంత్రిని ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలు సేకరిస్తున్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసుల చర్యను హైకోర్టు తప్పుబట్టింది. రాష్ట్ర పోలీసులు బంగారం అక్రమ రవాణా కేసును విచారిస్తున్న ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. ఇప్పటివరకు ఈడీ అధికారులకు వ్యతిరేకంగా సేకరించిన సాక్ష్యాలను ప్రత్యేక న్యాయస్థానానికి సీల్డ్ కవర్లో అందించాలని సూచించింది. ముఖ్యమంత్రి విజయన్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని తనను ఈడీ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని బంగారం స్మగ్లింగ్ కేసు ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్ చెబుతున్నట్లు వెలువడిన ఆడియో టేపు ఆధారంగా కేరళ పోలీసులు ఈడీపై కేసు పెట్టా రు. ఈ కేసును కొట్టేయాలని ఈడీ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు.