3,500 ఏళ్లయినా చెక్కుచెదరని దంతాలు
ABN , First Publish Date - 2021-12-30T07:23:54+05:30 IST
ఈజిప్టు అంటే గుర్తొచ్చేది మమ్మీలు. వేల సంవత్సరాల క్రితం చనిపోయిన రాజులు, రాజకుటుంబీకులు..
![3,500 ఏళ్లయినా చెక్కుచెదరని దంతాలు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921123001525065/12302021015332n45.jpg)
ఈజిప్టు మమ్మీని వర్చువల్గా పరిశీలించిన శాస్త్రజ్ఞులు
న్యూఢిల్లీ, డిసెంబరు 29: ఈజిప్టు అంటే గుర్తొచ్చేది మమ్మీలు. వేల సంవత్సరాల క్రితం చనిపోయిన రాజులు, రాజకుటుంబీకులు, మతపెద్దలను మమ్మీలుగా మార్చి భద్రపరిచేవారు. చరిత్రకారుల తవ్వకాల్లో బయటపడిన మమ్మీలను శాస్త్రవేత్తలు ఓపెన్ చేసి వాటి గుట్టు విప్పేవారు. అలా 3500 ఏళ్లనాటి ఒక మమ్మీని శాస్త్రజ్ఞులు తాజాగా పరిశీలించారు. కానీ.. భౌతికంగాకాదు. సీటీ స్కాన్ చేసి వర్చువల్గా శల్యపరీక్ష చేశారు. ఇంతకీ ఆ మమ్మీ ఎవరిదంటే.. క్రీస్తు పూర్వం 1,525 నుంచి 1,504 దాకా ఈజిప్టును పరిపాలించిన అమెన్హోటెప్-1 అనే రాజుది. మరణించే సమయానికి అమెన్హోటెప్-1 వయసు 35 ఏళ్ల దాకా ఉంటుందని, సున్తీ చేయించుకున్నాడని, 5.5 అడుగుల ఎత్తు ఉండేవాడని గుర్తించారు. ఆయన ఒంటిపై గాయాలేమీ లేవని, ఆయనది సహజ మరణం కావొచ్చని పేర్కొన్నారు. ఆయన చనిపోయి 3,500 ఏళ్లయినా దంతాలు చెక్కుచెదరకుండా ఉన్నాయని వెల్లడించారు. ఆయన ముక్కు, గడ్డం చాలా చిన్నగా ఉన్నాయని తెలిపారు. ఆధునిక కాలంలో ఇలా వర్చువల్గా తెరిచిన ఏకైక రాజు మమ్మీ ఇదే.