1999 సెనారీ ఊచకోత కేసు: మొత్తం 13 మంది నిందితులకు విముక్తి

ABN , First Publish Date - 2021-05-22T00:56:25+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సెనారీ ఊచకోత కేసులో మొత్తం 13 మంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తూ పాట్నా హైకోర్టు...

1999 సెనారీ ఊచకోత కేసు: మొత్తం 13 మంది నిందితులకు విముక్తి

పాట్నా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సెనారీ ఊచకోత కేసులో మొత్తం 13 మంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తూ పాట్నా హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.  నిందితులపై ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఈ 13 మందికి విముక్తి కల్పిస్తున్నట్టు జస్టిస్ అశ్విని కుమార్ సింగ్, జస్టిస్ అరవింద్ శ్రీవాస్తవలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 1999 మార్చి 18న మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ (ఎంసీసీ) కార్యకర్తలు ఓ అగ్ర కులానికి చెందిన 34 మందిని ఊచకోత కోశారు. బీహార్‌లోని జహనాబాద్ జిల్లా సెనారీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులను ఇళ్ల నుంచి ఓ ఆలయం వద్దకు లాక్కెళ్లి, వరుసలో నిలబెట్టిన మావోయిస్టులు.. గొడ్డళ్లతో నరికి, తుపాకులతో కాల్చి చంపారు. ఈ కేసులో మొత్తం 13 మందికి గతంలో జహనాబాద్ జిల్లాలోని దిగువ కోర్టు జీవిత ఖైదు విధించింది. 


కాగా ఈ కేసులో డిఫెన్స్ లాయర్ అన్షూల్ రాజ్ వాదనలు వినిపిస్తూ.. ‘‘సెనారీ గ్రామంలో జరిగిన ఊచకోత కేసులో నా క్లయింట్ల పాత్ర ఉన్నట్టు గుర్తించి చెప్పగల ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. వీరిని దోషులుగా చెప్పేందుకు సరైన ఆధారాలను గానీ, సాక్ష్యాలను గానీ ప్రాసిక్యూషన్ లాయర్ ప్రవేశపెట్టలేదు. కాబట్టి హైకోర్టు తక్షణమే వారికి విముక్తి ప్రసాదించాలి...’’ అని ధర్మాసనానికి అభ్యర్థించారు. ఈ కేసులో తొలుత 2002లో మొత్తం 72 మందిపై చార్జిషీట్ దాఖలైంది. అందులో 18 మంది పరారీలో ఉండగా.. 56 మందిపై దర్యాప్తు జరిగింది. 90వ దశకం చివర్లో జరిగిన సెనారీ ఘటన బీహార్‌లోని కుల సంబంధిత ఊచకోతల్లో చివరిది. 1997లో 57 మంది దళితులను బలితీసుకున్న లక్ష్మణ్-బాతే ఊచకోతకు దీనికి సంబంధం ఉందని చెబుతారు. రణ్‌వీర్ సేన అనే ఓ అగ్రకులానికి చెందిన ప్రైవేట్ దళం ఈ ఘటనకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. 

Updated Date - 2021-05-22T00:56:25+05:30 IST