11 మందికి Covid పాజిటివ్.. మరో పాఠశాల సీల్డౌన్
ABN , First Publish Date - 2021-12-12T17:47:38+05:30 IST
చిక్కమగళూరు జిల్లాలో మరో పాఠశాలను సీల్డౌన్ చేసినట్లు జిల్లా అధికారి కేఎన్ రమేష్ ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ఆర్పుర తాలూకాలోని జీవనజ్యోతి ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిపి
బెంగళూరు: చిక్కమగళూరు జిల్లాలో మరో పాఠశాలను సీల్డౌన్ చేసినట్లు జిల్లా అధికారి కేఎన్ రమేష్ ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ఆర్పుర తాలూకాలోని జీవనజ్యోతి ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిపి 11 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన మేరకు సీల్డౌన్ చేశామన్నారు. బాధితులకు వారి ఇళ్ళలోనే ఐసోలేషన్ చేసి చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు వారం రోజుల కిందట ఇదే జిల్లాలలోని నవోదయా విద్యాలయలో వందలాది మంది విద్యార్థులకు కొవిడ్ సోకిన విషయం తెలిసిందే. బెంగళూరులోని జాలహళ్లి ప్రాంతానికి చెందిన క్లోని కాన్వెంట్ విద్యాసంస్థకు విద్యాశాఖాధికారులు శనివారం నోటీసులు జారీ చేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు గుంపులుగా చేరరాదనే ఆంక్షలు ఉన్నాయి. కానీ విద్యార్థులను టూర్ తీసుకెళ్లినందుకు గాను నోటీసులు జారీ చేశారు. 130 మంది విద్యార్థులను నాలుగురోజుల పాటు హైదరాబాద్కు విహారయాత్రగా తీసుకెళ్లారు. ప్రతి విద్యార్థి నుంచి పదివేల దాకా వసూలు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం విద్యార్థులంతా హైదరాబాద్లో ఉన్నారు. సోమవారం వెనుతిరిగి రానున్నారు. విషయం తెలిసిన మేరకు ఉత్తర తాలూకా బీఈఓ కమలాకర్ విద్యాసంస్థకు నోటీసులు జారీ చేశారు.