మైక్రోవేవ్ వాడడం వల్ల నష్టాలున్నాయా?
ABN , First Publish Date - 2021-05-14T20:09:21+05:30 IST
మైక్రోవేవ్లో వండడం లేదా వేడిచేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు, ఇబ్బందులూ ఉన్నాయి. ఆహారం త్వరగా వేడెక్కడం వల్ల పోషక విలువలు తగ్గే అవకాశం తక్కువ. ముఖ్యంగా నీళ్లలో కరిగే విటమిన్లయిన సి, బిలు సురక్షితంగా ఉంటాయి. ఉడకబెట్టడం, ఆవిరి పై వండడం,

ఆంధ్రజ్యోతి(14-05-2021)
ప్రశ్న: మైక్రోవేవ్లో ఉడికించిన పదార్థాల్లో పోషక విలువలు తగ్గుతాయా? ఆహారం వేడి చెయ్యడానికి మైక్రోవేవ్ వాడటం వల్ల నష్టాలేమైనా ఉంటాయా?
- భాగ్యలక్ష్మి, విజయవాడ
డాక్టర్ సమాధానం: మైక్రోవేవ్లో వండడం లేదా వేడిచేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు, ఇబ్బందులూ ఉన్నాయి. ఆహారం త్వరగా వేడెక్కడం వల్ల పోషక విలువలు తగ్గే అవకాశం తక్కువ. ముఖ్యంగా నీళ్లలో కరిగే విటమిన్లయిన సి, బిలు సురక్షితంగా ఉంటాయి. ఉడకబెట్టడం, ఆవిరి పై వండడం, వేయించడం లాంటి వంట ప్రక్రియలతో పోలిస్తే, ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయిలను రక్షించడానికి మైక్రోవేవ్ అనుకూలం. మైక్రోవేవ్ ఓవేన్లో అన్ని రకాల వంటపాత్రలనూ వాడలేం. గాజు, కొన్ని రకాల సిరామిక్ పాత్రలనే ఇందులో వాడవచ్చు. వాటికి కూడా ఎలాంటి మెటాలిక్ గీతలు, డిజైన్లు లేకుండా చూడాలి. సరిగా పనిచేసే మైక్రోవేవ్ పాత్రలను వాడినప్పుడు అందులో నుంచి మైక్రోతరంగాలు బయటకు లీక్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ప్రమాదం లేదు. కొన్ని రకాల ఆహార పదార్థాలు మైక్రోవేవ్లో వేడిచేసినప్పుడు సమంగా వేడికావు. అందుచేత మైక్రోవేవ్లో వేడి చేసి లేదా వండిన ఆహారాన్ని ఓ ఐదు నిమిషాలపాటు పక్కన ఉంచడం లేదా గరిటెతో బాగా కలిపి వాడుకోవడం మంచిది. మాంసం, గుడ్లు, చేపలు తదితరాల్ని అందులో నిర్దేశించిన సూచనలకు అనుగుణంగా వాడితే ఎటువంటి ఇబ్బందీ ఉండదు.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)