తనయుడి కోసం తప్పుకున్న సీఎల్పీనేత
ABN , First Publish Date - 2021-03-15T13:24:06+05:30 IST
రాష్ట్ర శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో తన తనయుడిని పోటీకి దింపేందుకు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు కేఆర్ రామసామి పార్టీ టికెట్ను త్యాగం...
చెన్నై(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో తన తనయుడిని పోటీకి దింపేందుకు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు కేఆర్ రామసామి పార్టీ టికెట్ను త్యాగం చేశారు. ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు. కేఆర్ రామసామి శివగంగ జిల్లా కారైక్కుడి నియోజకవర్గం కాంగ్రెస్ శాసనసభ్యుడిగా ఉంటున్నారు. ఈయన ఆరుసార్లు శాసనసభ్యుడిగా గెలిచారు. రామనాథపురం జిల్లా తిరువట్టానై నియోజకవర్గంలో ఐదుసార్లు గెలిచారు. 1989, 1991, 2005 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున, 1996, 2001 తమిళ మానిలకాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2016 ఎన్నికల్లో కారైక్కుడిలో గెలిచి కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా ఉంటున్నారు. కేఆర్ రామసామి తండ్రి కరియమాణిక్కం అంబలం 1957, 1962, 1967, 1977 ఎన్నికల్లో తిరువట్టానై నియోజకవర్గంలో ఇండిపెండెంట్, స్వతంత్య్రపార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఈ నేపథ్యంలో తిరువట్టానై నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా కేఆర్ రామసామి తనయుడు రామ్ కరుమాణిక్కంను ఆ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. తన తాత, తండ్రి పోటీ చేసి గెలిచిన తిరువట్టానై నియోజకవర్గంలో కరుమాణిక్కం పోటీ చేయనున్నారు. కరుమాణిక్కంకు సీటు తీసివ్వడం కోసం కేఆర్ రామసామి ఈ సారి పోటీ నుంచి తప్పుకున్నారు. తనకు బదులుగా తనయుడికి సీటివ్వమంటూ చేసిన అభ్యర్థనను కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది.