సీహెచ్సీ పోస్టులు ఖాళీ
ABN , First Publish Date - 2021-02-06T18:04:12+05:30 IST
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రా(సీహెచ్సీ)ల్లో భారీగా స్పెషలిస్టు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. సీహెచ్సీల్లో మంజూరైన మొత్తం స్పెషలిస్టు వైద్యుల పోస్టులు 625 ఉంటే అందులో 367 ఖాళీలున్నాయని కేంద్ర ఆరోగ్య

625 వైద్యుల పోస్టుల్లో 367 ఖాళీలు.. వెల్లడించిన కేంద్రం
న్యూఢిల్లీ /హైదరాబాద్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రా(సీహెచ్సీ)ల్లో భారీగా స్పెషలిస్టు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. సీహెచ్సీల్లో మంజూరైన మొత్తం స్పెషలిస్టు వైద్యుల పోస్టులు 625 ఉంటే అందులో 367 ఖాళీలున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) మంజూరైన వైద్యుల పోస్టులు 1254 ఉండగా ప్రస్తుతం 1213 మంది వైద్యులు పనిచేస్తున్నారు. మరో 41 ఖాళీలున్నాయి. పట్టణ పీహెచ్సీల్లో 498 పోస్టులు మంజూరైతే ఇంకా 28 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి శుక్రవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రజారోగ్యం, ఆస్పత్రులు రాష్ట్రాల పరిధిలోని అంశమని, పరిపాలన, సిబ్బంది నియామం వంటి వ్యవహారాలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయని తెలిపారు.
8 పీహెచ్సీల్లో ప్రమాణాల్లేవ్
తెలంగాణలో ఎనిమిది పీహెచ్సీల్లో భారత ప్రజా ఆరోగ్య ప్రమాణాలు అమలు కావడంలేదు. వీటిలో సిరిసిల్లలో ఒకటి, వనపర్తిలో రెండు, నాగర్ కర్నూల్ జిల్లాలో రెండు, నిజామాబాద్లో 1, మహబూబ్నగర్ 1, కామారెడ్డిలో ఒక పీహెచ్సీలు ఉన్నాయి. కాగా మరో 628 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లు మాత్రం భారత ప్రజా ఆరోగ్య ప్రమాణాల ప్రకారం నడుస్తున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
పట్టించుకోని ఉన్నతాధికారులు
రాష్ట్రంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలన్నీ టీవీవీపీ పరిధిలోకి వస్తాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ వైద్య విధాన పరిషత్కు ఒక్కసారి మాత్రమే పూర్తిస్థాయి కమిషనర్ ఉన్నారు. ప్రస్తుతం వైద్య విద్య సంచాలకుడిగా ఉన్న డాక్టర్ రమేశ్రెడ్డికి టీవీవీపీ కమిషనర్గా ఇంచార్జి బాధ్యతలను అప్పగించారు. రెండు కీలక పోస్టులను చూడాల్సి రావడంతో టీవీవీపీ ఆస్పత్రులను ఆయన సరిగా పట్టించుకోవడంలేదన్న విమర్శ ఉంది. పూర్తిస్థాయి కమిషనర్ నియామకంతోనే వైద్యుల కొరత, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించే అవకాశం ఉంటుంది.