చేయూతకు కోతలు
ABN , First Publish Date - 2021-06-19T04:34:39+05:30 IST
సంక్షేమ పథకాల భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. కోతలు, వడపోతలు, ఏరివేతల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉంది.
వడపోతలు..ఏరివేతలు
లబ్ధిదారుల తగ్గింపునకు ఎత్తులు
కుటుంబంలో పింఛనుదారు ఉంటే కట్ ?
ఇప్పటికే దివ్యాంగులకు రద్దయిన ‘చేయూత’
తణుకుకు చెందిన ఒక దివ్యాంగ మహిళ కిందటేడాది ‘వైఎస్సార్ చేయూత’ సాయం పొందింది. ఈ ఏడాది కూడా చేయూత కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. ఇటీవల లబ్ధిదారుల జాబితా విడుదల అవడంతో వలంటీర్ను అడగ్గా జాబితాలో ఆమె పేరు లేదనిచెప్పింది. ఎందుకిలా జరిగిందని ఆరా తీయగా దివ్యాంగ పింఛనుదారులకు ఇకపై చేయూత రాదని వలంటీర్ సమాధానమిచ్చింది.
ఏలూరు, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ పథకాల భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. కోతలు, వడపోతలు, ఏరివేతల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉంది. మొన్న జగనన్న తోడు.. నిన్న వాహనమిత్ర.. నేడు చేయూత పథకాలలో కోతల ప్రక్రియ నిరాఘాటంగా కొనసాగుతోంది. పింఛనుకు, చేయూతకు ముడివేసి లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గించేందుకు కసరత్తు మొదలైంది. జిల్లాలో ఇప్పటికే కోతల జాబితాలో దివ్యాంగ పింఛనుదారులు చేరిపోగా, మిగిలిన వారి కోసం ముమ్మరంగా వేట సాగుతోంది. గ్రామీణాభివృద్ధి శాఖ ఏరివేత ప్రక్రియను ముమ్మరం చేసింది. చేయూత లబ్ధిదారుల వడపోత నిబంధనల జాబితా వలంటీర్లకు చేరడంతో వారు ఇప్పుడు ఇదేపనిలో ఉన్నారు.
పింఛను ఉంటే చేయూత కట్..
జిల్లాలో మొత్తం 4,87,752 మంది పింఛనుదారులు ఉన్నారు. కిందటేడాది వైఎస్సార్ చేయూత పథకం కింద లక్షా 70 వేల 800 మంది లబ్ధి పొందారు. ఈ ఏడాది మరో 34,062 మంది అదనంగా జాబితాలో చేరారు. దీంతో ఈ భారాన్ని తగ్గించు కునేందుకు డీఆర్డీఏ చర్యలు చేపట్టింది. ఆ క్రమంలోనే డీఆర్డీఏ పీడీ పేరిట ఒక ఫార్వార్డ్ మెసేజ్ వలంటీర్ల వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తోంది. ‘‘వైఎస్సార్ చేయూత– కుటుంబంలో వైఎస్సార్ పింఛనుదారులు ఉన్నచో వారికి వైఎస్సార్ చేయూత పథకమనకు అర్హత లేదు. దరఖాస్తుదారు ఒంటరి మహిళ, వితంతు పింఛను తీసుకుంటున్న వారు తప్ప మిగిలిన ఏ పింఛను తీసుకుంటున్న వారికి వైఎస్సార్ చేయూత పథకం అర్హత లేదు’’ అన్నది డీఆర్డీఏ పీడీ పేరిట వచ్చిన మెసేజ్ సారాంశం. ఈ సమాచారం ప్రకారం ఇంట్లో ఒక పింఛనుదారు ఉంటే ఆ కుటుంబ సభ్యులు చేయూత పథకానికి అనర్హులు అని, కేవలం వితంతు, ఒంటరి మహిళలే అర్హులని తెలుస్తోంది. ఆ ప్రకారం చూసుకున్నా జిల్లాలో సుమారు 15 వేల మంది అనర్హత బారిన పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
పాపం.. దివ్యాంగులు
దివ్యాంగ పింఛను తీసుకునేవారిని ప్రభుత్వం వైఎస్సార్ చేయూత రెన్యువ ల్ జాబితా నుంచి ఇప్పటికే తొలగిం చింది. ప్రభుత్వం తాజాగా విడుదల చే సిన జాబితా ప్రకారం ఈ ఏడాది కొత్త గా దరఖాస్తు చేసుకున్న 34,062 మంది లో 8,257 మంది అనర్హతకు గురవగా కిందటేడాది దరఖాస్తు చేసుకున్న 1,73, 499 మందిలో కేవలం 2,699 మంది మాత్రమే అనర్హతకు గురయ్యారు. ప్రభు త్వం ఇప్పటికే దివ్యాంగులను అనర్హులు గా ప్రకటించడంతో తాజాగా విడుదల చేసిన జాబితాలో పెరిగిన సంఖ్య ది వ్యాంగులదేనని స్పష్టమవుతోంది. జిల్లా లో ప్రస్తుతం 54,052 మంది దివ్యాం గులు పింఛను తీసుకుంటున్నారు. వీరి లో పదోవంతు వేసుకున్నా సుమారు 6 వేల మంది ఇప్పటికే అనర్హతకు గురైన ట్లు లెక్క. ఇదే జాబితాలో వయోపరిమి తి సడలింపులతో పింఛను పొందుతున్న చేనేత, కల్లుగీత, చర్మకార తదితర వర్గా ల మహిళలు చేరే అవకాశం ఉంది. వీరిలో కూడా రెండు పథకాలకు అర్హు లుగా ఉన్న మహిళలు పెద్ద సంఖ్య లో నే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లా లో 4,357 మంది చేనేత కార్మికులు, 5,735 మంది కల్లుగీత కార్మికులు 2,158 మంది మత్స్యకారులు 988 మంది చర్మ కా రులు 1,168 మంది డప్పు కళాకారు లు పింఛను పొందుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 45 నుంచి 60 మధ్య వయసుండి ప్రత్యేక కేటగిరీలో పింఛను తీసుకుంటున్న మహిళలు ఇప్పుడు చేయూతకు దూరం కానున్నారు.