రెండో రోజూ అదే జోరు
ABN , First Publish Date - 2021-12-09T05:39:15+05:30 IST
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తమ పీఆర్సీ, పెండింగ్ డీఏల కోసం కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులైజేషన్ కోసం చేపట్టిన నిరసన దీక్షల ప్రభావం జిల్లాలో బుధవారం రెండో రోజూ కూడా కొనసాగింది.

జిల్లా అంతటా కొనసాగిన
ఉద్యోగ, ఉపాధ్యాయ నిరసన
ఏలూరు డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తమ పీఆర్సీ, పెండింగ్ డీఏల కోసం కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులైజేషన్ కోసం చేపట్టిన నిరసన దీక్షల ప్రభావం జిల్లాలో బుధవారం రెండో రోజూ కూడా కొనసాగింది. జిల్లా కేంద్రం ఏలూరు మొదలు మారుమూల ఏజెన్సీ ప్రాంతం వరకూ ఒకటే స్ఫూర్తితో ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. గ్రామీణ ప్రాంత ఉద్యోగులూ నిరసనలో పాల్గొవడంతో గ్రామాల్లో కూడా ఆ ప్రభావం బాగా కన్పించింది. కాంట్రాక్ట్, క్లాస్–4 ఉద్యోగులు, డ్రైవర్లు, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సహా జిల్లాస్థాయి అధికారుల వరకూ రెండో రోజూ నిరసనలో భాగస్వాములయ్యారు. జిల్లావ్యాప్తంగా వున్న 128 పీహెచ్సీలు, అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించే విధులకు హాజరయ్యారు.
ఐఏఎస్ అధికారుల మినహా...
జిల్లాలో ఐఏఎస్ అధికారుల మినహా మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రెండో రోజూ నిరసన ఉద్యమంలో భాగస్వా ములయ్యారు. జిల్లా రెవెన్యూ అధికారి డేవిడ్రాజుకు కలెక్టరేట్లో రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడు రమేష్ కలిసి నల్లబ్యాడ్జీ పెట్టి నిరసనలో భాగస్వామ్యం చేశారు. ఆయనతో పాటు జిల్లా సహకార అధికారి మురళీకృష్ణ, ఆర్అండ్బీ ఎస్ఈ నిర్మల, నీటిపారుదల శాఖ ఎస్ఈ, ఈఈలు, పబ్లిక్ హెల్త్ ఈఈ, పే అండ్ అకౌంట్ అధికారుల సహా పలుశాఖల జిల్లా అధికారులు నిరసనలో భాగం పంచుకున్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని ప్రణాళికా కార్యాలయం, పౌరసరఫరాలు, గ్రామీణాభివృద్ధి, సహకార శాఖ, ట్రెజరీ, గ్రామీణ నీటిసరఫరా, సర్వే, మైనార్టీ, సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమశాఖ, పంచాయతీరాజ్ శాఖల కార్యాలయాలన్నీ అధికారులతో సహా నల్లబ్యాడ్జీలతో నిండిపోయాయి.