కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలి
ABN , First Publish Date - 2021-01-13T06:21:53+05:30 IST
వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో మౌలిక వసతులకు నిర్మాణాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు.
అధికారులతో కలెక్టర్ ముత్యాలరాజు సమీక్ష
ఏలూరు సిటీ, జనవరి 12 : వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో మౌలిక వసతులకు నిర్మాణాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా లే అవుట్లలో ప్రభుత్వపరంగా కల్పించే మౌలిక వసతులపై మంగళవారం కలెక్టర్.. తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యుఎస్, డ్వామా, ఆర్అండ్బీ, విద్య, వైద్య, ఆరోగ్య తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని వసతులతో ముందుగా ఒక మోడల్ లే అవుట్ను నిర్మించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భవిష్యత్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు పక్కా ప్లాన్తో ఉండాలన్నారు. సీసీ రహదారులు, అంతర్గత రహదారులు ముందుగా నిర్మిస్తే లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలకు అవసరమైన సామగ్రి తరలించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఇంటికి విద్యుత్, పైప్లైన్ కనెక్షన్ ముందుగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి కాలనీలో అంగన్వాడీ, సచివాలయం, హెల్త్ క్లినిక్లు, బస్టాండ్, పార్కులు, విద్యుత్ సబ్స్టేషన్ వంటి నిర్మాణాలను ఎక్కడ నిర్మించాలనే దానిపై అధికారులు ముందుగానే ప్లాన్ చేసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్లు కె.వెంకటరమణారెడ్డి, హిమాన్షు శుక్లా, మౌసింగ్ పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.