అన్ని రంగాల్లో తెలుగువారి భాగస్వామ్యం
ABN , First Publish Date - 2021-11-02T05:57:44+05:30 IST
అన్ని దేశాలలో, అన్ని రంగాలలో తెలుగువారి భాగస్వామ్యం ఎంతో ఘనమైనదని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు.
జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా
ఏలూరు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): అన్ని దేశాలలో, అన్ని రంగాలలో తెలుగువారి భాగస్వామ్యం ఎంతో ఘనమైనదని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను సోమవారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ మిశ్రా తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరిం చారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు.సంస్కృతీ, సంప్రదాయాల మేళవింపుతో ఆత్మీయంగా ఉండే తెలుగుభాష ద్రవిడ భాషకు దగ్గరగా ఉంటుందన్నారు. ఎకడికి వెళ్లినా,ఏ రంగంలో చూసినా తెలుగువారు తప్పక కనిపిస్తుంటారన్నారు. ఆంధ్రప్రదేశ్లో 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉందని, తూర్పు, పశ్చిమ జిల్లాలు దేశానికే ధాన్యాగారంగా నిలిచాయని కొనియాడారు.విశాఖపట్నం, నెల్లూరులు పారిశ్రామిక కేంద్రాలుగా ఖ్యాతినొందాయన్నారు. సామా జిక న్యాయం, మహిళా స్వశక్తి అనే రెండు బలమైన వ్యవస్థలు అభివృద్ధి వైపు కలిసి పనిచేస్తున్నాయని, ఈ విధమైన విధానం మరే రాష్ట్రంలో ఏర్పాటు కాలేదని ఆయన కితాబిచ్చారు. కార్యక్రమంలో జేసీ బీఆర్ అంబేడ్కర్, డీఆర్వో డేవిడ్ రాజు, ఏలూరు ఆర్డీవో పనబాక రచన, కమాండర్ కె.సుధాకర్, కుమారి అఖిలాండేశ్వరి తదితరులు పాల్గొన్నారు.