గంజాయి మత్తులో దోపిడీలు..ఐదుగురి అరెస్టు

ABN , First Publish Date - 2021-09-04T05:18:51+05:30 IST

చెడు వ్యసనాలకు బానిసలై గంజా యి మత్తులో రహదారులపై రాత్రి వేళల్లో దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసు లు అరెస్టు చేశారు.

గంజాయి మత్తులో దోపిడీలు..ఐదుగురి అరెస్టు
పోలీసులు అరెస్టు చేసిన నిందితులు

ఏలూరు క్రైం, సెప్టెంబరు 3 : చెడు వ్యసనాలకు బానిసలై గంజా యి మత్తులో రహదారులపై రాత్రి వేళల్లో దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసు లు అరెస్టు చేశారు. కేసు వివరాలను  త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌ వెల్లడించారు. పెదపాడు మండలం ఏపూరు వాటర్‌ ప్లాంట్‌ ప్రాంతానికి చెందిన రాణీమేకల జ్ఞాన విజయ్‌బాబు (20), చెరుకుమిల్లి శివకుమార్‌ (22)లతో పాటు మరో ముగ్గురు మైనర్లు కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా ఏలూరు మినీబైపాస్‌ రోడ్డులో రాత్రివేళ రెండు మోటారు సైకిళ్లపై తిరుగుతూ ఒంటరిగా వెళ్లే ద్విచక్ర వాహనదారులను, పాదచారులను గుర్తించి వారిని బెదిరించి వారి వద్ద ఉన్న బంగారు వస్తువులు, నగదు, సెల్‌ఫోన్లు అపహరిస్తున్నారు. ఎదురు తిరిగితే ఇనుపరాడ్డుతో కొట్టి గాయపరుస్తున్నారు. ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఇటువంటి కేసుకు సంబంధించి  త్రీటౌన్‌ సీఐ ప్రసాద్‌, సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పా టు చేసి నిఘా ఉంచారు. ఈ ముఠా అనుమానాస్పదంగా తిరగడంతో అదుపు లోకి తీసుకుని విచారించగా వీరు చేసిన దోపిడీలు వెలుగుచూశాయి. త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు నేరాలకు సంబంధించి కేసులు నమోదు కాగా,  ఏలూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఒక కేసు నమోదయింది. వీరు గంజాయికి బానిసలై ఆ మత్తులో దోపిడీలకు పాల్పడుతున్నట్టు డీఎస్పీ చెప్పారు. నింది తుల నుంచి ఏడు వందల రూపాయల స్పోర్ట్స్‌ వాచ్‌, మోటారు సైకిల్‌ బజాజ్‌ పల్సర్‌, మూడు సెల్‌ ఫోన్లు, 1720 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసు కున్నారు. వీరిలో రాణిమేకల జ్ఞాన విజయ్‌బాబు, చెరుకుమిల్లి శివకుమార్‌ లను కోర్టుకు హాజరుపరుస్తున్నామని, మిగిలిన ముగ్గురు మైనర్లను జువైనల్‌ హోంకు తరలిస్తున్నట్టు డీఎస్పీ వెల్లడించారు. కేసును ఛేదించిన త్రీటౌన్‌ సీఐ ప్రసాద్‌, సిబ్బంది హెడ్‌కానిస్టేబుల్‌ సీహెచ్‌ సీతారామస్వామి, కానిస్టేబుల్‌ ఓం ప్రకాష్‌, లక్ష్మీనారాయణ, గొల్లరాజులను డీఎస్పీ అభినందించారు.

Updated Date - 2021-09-04T05:18:51+05:30 IST