తడబడిన ఓటు..
ABN , First Publish Date - 2021-04-09T06:07:43+05:30 IST
నెలరోజుల వ్యవధిలోనే ఓటర్లలో ఎంతలో ఎంత మార్పు.. పరిషత్ పోరును ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బహిష్కరించడం పోలింగ్ శాతంపై ప్రభావం చూపింది. స్థానిక పోరులో తొలిసారిగా పోలింగ్ శాతం కనిష్ట స్థాయికి చేరింది.
పరిషత్లో భారీగా పడిపోయిన పోలింగ్
పంచాయతీలకంటే 13.86 శాతం తక్కువ..
టీడీపీ బహిష్కరణ ఎఫెక్ట్
తాయిలాలందక ఓటింగ్కు పెద్దగా రాని జనం..
మొదటి 5 గంటలే భారీ పోలింగ్
మహిళా ఓటర్లే ఎక్కువే.. కదలని కుర్రకారు
సాయంత్రం వేళల్లో బూత్లన్నీ ఖాళీ
తగ్గని వలంటీర్లు.. దగ్గరుండి నడిపించారు
ఏజెన్సీలో ప్రశాంతం.. భారీగా పోలింగ్
పలు ప్రాంతాల్లో కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్పీ నారాయణ నాయక్ పరిశీలన
నెలరోజుల వ్యవధిలోనే ఓటర్లలో ఎంతలో ఎంత మార్పు.. పరిషత్ పోరును ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బహిష్కరించడం పోలింగ్ శాతంపై ప్రభావం చూపింది. స్థానిక పోరులో తొలిసారిగా పోలింగ్ శాతం కనిష్ట స్థాయికి చేరింది. మొదటి ఐదు గంటల్లోనే ఓటర్లు ఓటు వేసి ఆ తరువాత సాయంత్రం వరకూ పలుచగా పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. ఇంతకు ముందు మాదిరిగా ఓటర్లకు సొమ్ములు చేరలేదు. పెద్దగా తాయిలాలు అందలేదు. ఇంటికి వచ్చి మరీ ఓటు వేయమని బామాలలేదు. అన్నిచోట్లా రాజకీయ నిరుత్సాహమే. ఇదంతా ఓటరుపై ప్రభావం చూపింది. పంచాయతీ పోరులో 82.13 శాతం పైగా ఓటు హక్కు వినియోగించుకోగా.. పరిషత్కు వచ్చేసరికి దాదాపు14 శాతం తగ్గి 68.27 శాతం పైబడి మాత్రమే ఓట్లు పోలయ్యాయి.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
పరిషత్ పోరు అత్యంత ఉత్సాహంగా జరుగుతుందని తొలుత భావించారు. దీనికి భిన్నంగా అనేక సమీకరణల్లో మార్పులు, చే ర్పులు.. రాజకీయ నిర్ణయాలు వెరసి అనేక మలుపులు తిరిగి చి వరికి ఈ ఎన్నికలపై ప్రభావం చూపాయి. జిల్లా అంతటా గురు వారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ఆరంభం కాగా మం డల కేంద్రాలు సహా మేజర్ పంచాయతీలు, ముంపు మండలాలు, ఏజెన్సీలోనూ పోలింగ్ కేంద్రాల ఎదుట వందలాది మంది ఓటర్లు బారులు తీరారు. ఇంకేముంది ఈ సారి పోలింగ్ శాతం అత్యధికంగా ఉంటుందని అం దరూ ఊహించారు. కానీ తొలి ఐదు గంటల్లోనే పోలింగ్ కేంద్రాల్లో సంద డి కనిపించింది. ముంపు మండ లాలైన కుక్కునూరు, వేలేరుపాడు ల్లోనూ బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏజె న్సీలోనూ ఇదే పరిస్థితి. తొలి గంటలో మహిళలు, మధ్య వయస్కులు అత్య ధికంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. ఎండ ముదిరే సమయానికి 11 గంటల వరకూ ఈ రద్దీ కొనసాగింది. ఒకవైపు వయసు పైబడినవారంతా పోలింగ్ కేంద్రాల ముఖం చూడలేదు. మహిళలు, మధ్య వయస్కులే అత్యధికంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రధాన ప్రతి పక్షం టీడీపీ పరిషత్ పోరును బహిష్కరిస్తున్నట్లు ప్రకటించ డంతో ఎన్నికల రంగం చప్పపడిపోయింది. కొన్నిచోట్ల తెలుగు తమ్ముళ్ళు పోటీకి సై అన్నారు. ఇలాంటిచోట్లే అంతో ఇంతో ఓటిం గ్ శాతం పెరిగింది. మిగతాచోట్ల మధ్యాహ్నం తరువాత పోలింగ్ బూత్లన్నీ ఖాళీగా కన్పించాయి. ఒంటి గంట నుంచి మూడు వరకూ కొన్నిచోట్ల ఓటర్ల జాడేలేదు. అత్తిలి, పెదవేగి మండలాల్లో ఎంపీటీసీల బ్యాలెట్లు తారుమారయ్యాయి. కాసేపు పోలింగ్ ఆగింది. బ్యాలెట్ పత్రాల పంపిణీలోనే జరిగిన ఈ తంతును సవరించేందుకు కొంత సమయం పట్టింది. మిగతా చోట్ల సాఫీగా సాగింది. బుట్టాయిగూడెం, పోలవరం, కొయ్యలగూడెం, టి.నర్సా పురం, జీలుగుమిల్లి వంటి మండలాల్లో మారుమూల గిరిజన గ్రా మాల్లోనూ పోలింగ్ సాఫీగానే జరిగినా శాతం మాత్రం తగ్గింది.
ఎందుకిలా జరిగింది ?
గడిచిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా పోలిం గ్ శాతం సరాసరిన 48 మండలాల్లోనూ 82.13 శాతం. అప్పట్లో ఏ గ్రామాన్ని కదిపినా, ఏ మండలంలో చూసినా ఓట్లతో బాక్సులన్నీ నిండాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ జనం క్యూలు తరగలేదు. సాయంత్రం పోలింగ్ ముగిసే రెండు గంటల ముందు అనేక మండలాల్లో రద్దీ తలెత్తింది. సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్ల ఉత్సాహం చూసి అన్ని పక్షాలు నోరు వెళ్ళబెట్టాయి. పరిషత్ పోరులోనూ అంతా ఇదే సాగుతుందనుకున్నారు. కానీ సీను కాస్త రివర్స్ అయింది. టీడీపీ బరిలో లేకపోవడం ప్రత్యేకించి ప్రచారం జరగకపోవ డం, ఓటర్లను ప్రాధేయపడి ఓట్లు అడిగేవారు లేకపో వడంతో పోలింగ్ శాతం గతంలో కంటే భారీగా పడిపోయింది. జంగారెడ్డిగూడెం డివిజన్లో గడిచిన పంచాయతీ ఎన్నికల్లో 82.76 శాతం మేర పోలింగ్ నమోదు కాగా ఇప్పుడది కాస్త తగ్గు దలకు వచ్చింది. గత సర్పంచ్ ఎన్నికల్లో పోలవరం ముంపు మం డలం కుక్కునూరులో అత్యధికంగా 87.27 శాతం నమోదవగా పరిషత్ పోరుకు వచ్చేసరికి 71.09 శాతానికి పడిపోయింది. టి.న ర్సాపురం మండలంలో అప్పట్లో 87.51 శాతం నమోదవగా ఇప్పు డు 75.20 శాతం మాత్రమే వచ్చింది. కామవరపుకోటలో 81 నుంచి 66.26 శాతానికి, జంగారెడ్డిగూడెంలో 81 నుంచి 69.60 శాతానికి, కొయ్యలగూడెంలో 82 నుంచి 65.82 శాతానికి ఓటింగ్ శాతం క్షీణించింది. ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లోనే కాదు డెల్టాలోనూ ఇదే క్షీణత కన్పించింది. ప్రధాన ప్రతిపక్షం పోరులోలేని ప్రభావం స్పషంగా బయట పడింది. పాలకొల్లు మండలం పంచాయతీ పోరులో 80 శాతం పోలవగా ఇప్పుడది 69.27 శాతానికి పడిపో యింది. భీమవరంలోనూ 81 నుంచి 69.87 శాతానికి, అత్తిలిలో 80 నుంచి 70.19 శాతానికి, పెనుగొండలో 75 నుంచి 68.58 శాతానికి ఇలా వరుసగా పోలింగ్ శాతం పడిపోయింది. సాధా రణంగా పల్లె ప్రాంతంలో తెలుగుదేశానికి బలమైన క్యాడర్, క్రమ శిక్షణ గల నేతలూ ఉన్నారు. వీరందరూ పార్టీ ఆదేశం మేరకు ఎన్ని కలకు దూరంగా మౌనంగా మిగిలిపోయారు. ఓటర్లలోనూ ఈ తేడా కనిపించింది. రాజకీయ పరంగా పెరుగుతున్న కొన్ని ఘట నలు ఓటర్లలో నిర్వేదం నింపాయి. కుర్రకారు ఈసారి ఎన్నికల్లో పెద్దగా హల్చల్ చేయలేదు. పంచాయతీ పోరులో ఓటుకు వెయ్యి నుంచి ఐదు వేల వరకూ ఓటరుకు చేరితే ఈ ఎన్నికల్లో అధికార పార్టీ మాత్రమే 200 నుంచి రూ.800 వరకూ చెల్లించింది. దీంతో కొన్ని వర్గాలు పోలింగ్ కేంద్రాల ముఖమే చూడలేదు. వలంటీర్లు అధికార పార్టీకి రుణం తీర్చుకునేందుకు నేరుగా ఓటర్లను ఒప్పించి పోలింగ్ కేంద్రాలకు పంపారు. ఏలూ రు రూరల్ మండలంలో చాలా గ్రామాల్లో ఇదే సీన్ కన్పించింది. ఎలాగో ప్రధాన పార్టీలు పోటీ లేదు కాబట్టి ఇంక అధికార వైసీ పీకి తిరుగు లేకుండాపోయింది. ఫలితాలు ఏకపక్షం కాబోతున్నా యన్న భావనతో ఓటేద్దామనుకున్న ఓటర్లు సైలెంట్ అయ్యారు.
వేలేరుపాడు అత్యధికం.. పోలవరం అత్యల్పం 54.01
ఏలూరుసిటీ, ఏప్రిల్ 8: జిల్లాలో జడ్పీటీసీ, ఎం పీటీసీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 45 జడ్పీటీసీలకు, 781 ఎంపీటీసీల ఎన్నికలకు సంబంధించి 2,855 కేంద్రాల లో పోలింగ్ నిర్వహించారు. మొత్తం 68.27 శాతం పోలింగ్ జరుగగా అత్యధికంగా వేలేరుపాడు మండ లంలో 78.91 శాతం పోలైంది. పోలవరం మండలం లో అత్యల్పంగా 54.01 శాతం పోలింగ్ జరిగింది. పంచాయతీ ఎన్నికల పోలింగ్తో పరిశీలిస్తే పరిషత్ లో దాదాపుగా 13.86 పోలింగ్ శాతం తగ్గిందని చెప్పవచ్చు. జిల్లాలో ఉదయం 7 గం టలకే పోలింగ్ మొదలైనా ఓటర్లు మందకొడిగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో జిల్లాలో తొలిగంటలో కేవలం 3.42 శాతమే పోలింగ్ జరిగింది. పోలింగ్ సరళిని కలెక్టర్ రేవు ముత్యాలరాజు వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ఎక్కడా అవాంఛనీ యమైన సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ నారాయణనాయక్ జిల్లాలోని పలుప్రాంతాల్లో పర్యటించారు.
రాపాకలో రీపోలింగ్..బ్యాలెట్ పత్రాలు తారుమారు
ఇరగవరం, ఏప్రిల్ 8: రాపాకలో అభ్యర్థుల బ్యాలెట్ పేపర్లు తారు మారు కావడంతో శుక్రవారం రీపోలింగ్కు ఆర్డీవో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ కామన దుర్గ (టీడీపీ), బొల్లా పద్మావతి (వైసీపీ), బొల్లా వెంకటలక్ష్మి (బీజేపీ) ఎంపీటీసీ అభ్యర్థులుగా నిలిచారు. 26వ పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం బ్యాలెట్ పేపర్లు తారుమారయ్యాయని తమ పార్టీకి గుర్తు లేదని టీడీపీ నాయకులు సిబ్బందిని ప్రశ్నించారు. పోలింగ్ అధికారి కె.ఉషారాణి బ్యాలెట్ను పరిశీ లించగా బ్యాలెట్ మారిందని సిద్దాంతం గ్రామా నికి చెందిన ఎంపీటీసీ బ్యాలెట్ పేపరు కలిసిం దని తెలపడంతో అభ్యర్థులు షాక్కు గురైయ్యారు. రీపోలింగ్కు డిమాండ్ చేయడంతో ఎన్నికల అధికారి రాజేశ్వరరావు సమస్యను ఆర్డీవో దృష్టికి తీసుకువెళ్లారు. శుక్రవారం ఇక్కడ రీపోలింగ్కు ఆర్డీవో బి.లక్ష్మారెడ్డి ఆదేశించారు. ఈ కేంద్రంలో 709 మంది ఓటర్లకు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎంపీడీవో, ఎన్నికల అధికారి రాజేశ్వరరావు తెలిపారు.
ఎన్నికలు బహిష్కరించిన ప్రజలు
వేలేరుపాడు : ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి మొన్నటి వరకు 41.15 కాంటూర్ పరిధిలో ఉన్న తమ గ్రామాన్ని 45 కాం టూర్కు మార్చడంపై నిరసన వ్యక్తం చేస్తూ పరిషత్ ఎన్నికలను తాట్కూరుగొమ్ము కాలనీ ప్రజలు బహిష్కరించారు. గ్రామప్రధా న రహదారిపై బైఠాయించారు. కుక్కునూరు సీఐ బాలసురేష్ బా బు వారికి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. అటువైపు వచ్చిన ఐటీ డీఏ పీవో సూర్యనారాయణ తమకు హామీ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కోడ్ అమల్లో ఉండగా తాను హామీ ఇవ్వలేనని, తర్వాత మాట్లాడతానని చెప్పినా వినలేదు. గంట తరువాత అధికారులు, వైసీపీ నాయకులు సర్దిచెప్పడంతో ఆందో ళన విరమించారు.
ఎల్ఎన్డీ పేటలో అదే గొడవ..
పోలవరం : ఎల్ఎన్డీ పేట గ్రామస్థులు పరిషత్ ఎన్నికలనూ బహిష్కరించారు. గురువారం పోలింగ్ బూత్ల వైపు కన్నెత్తి చూ డలేదు. ఓటర్లు రాకపోవడంతో అధికారులు సాయంత్రం వరకు వేచి చూసి వెనుదిరిగారు. బీసీలు, ఇతర వర్గాలు ఎక్కువగా ఉన్న తమ గ్రామంలో గిరిజనులకు కేటాయించడంపై నిరసిస్తూ ఇటీ వల పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. తమకు రిజర్వేష న్లు కేటాయించి నాన్షెడ్యూల్ ప్రాంతంగా పరిగణించాలని కోరు తూ అధికారులను గ్రామస్థులు కోరారు.