సాగునీరందేనా..?

ABN , First Publish Date - 2021-02-06T05:16:08+05:30 IST

మండలంలో చేలకు సాగు నీరందక చేలు ఎండుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాగునీరందేనా..?
అడుగంటిన చెరుకువాడ శివారు పంట కాల్వ

నేటి నుంచి ఉండి పంట కాల్వకు వంతులు

ఉండి, ఫిబ్రవరి 5: మండలంలో చేలకు సాగు నీరందక చేలు ఎండుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కాల్వలు అడుగంట డంతో దాళ్వా గట్టెక్కుతామా అని ఆందోళన చెందుతున్నారు. ఉండి పంట కాల్వకు 6 నుంచి 12 వరకు వంతుల వారీ విధానంలో సాగు నీరందిస్తామని అధికారులు చెప్పడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. 


ఉండి కాల్వకు శనివారం నుంచి వంతు ప్రారంభమవుతుందని ఇరిగేషన్‌ డీఈ వెంకటేశ్వరరావు శుక్రవారం తెలిపారు. ఆయా చానల్స్‌కు వచ్చే సాగు నీటిని రైతులంతా వినియోగించుకోవాలన్నారు. వంతులవారీ విధానంలో సు మారు 50 వేల ఎకరాలకు సాగునీటిని విడుదల చేయడం జరుగుతుందని డీఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఉండి, గణపవరం, పాలకోడేరు, భీమవరం, కాళ్ల మండలాలకు సంబంధించి ఆయా చానల్స్‌కు సాగునీరు అందుతుం దన్నారు. సాగునీటి విషయంలో రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయా కాలువలను నీటి సామర్ధ్యంను తాను ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.


దాళ్వా కూడా నష్టపోతే ఆత్మహత్యలే..

ఆకివీడు: వ్యవసాయాలకు సాగునీరు అందించే వంతులు పూర్తవుతున్న చుక్కనీరు విడుదల చేయడంలేదని మాదివాడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంక, జమ్ముకోడులు ఇప్పటికే రైతులు, కూలీలు కలిసి రెండు మూడుసార్లు బాగుచేసుకున్నా పొలాలకు నీరందడం లేదని కౌలు రైతులు పుప్పాల ఆంజనేయులు, కేశిరెడ్డి ఏసుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వరదలతో గత సార్వా పూర్తిగా నష్టపోయాం, దాళ్వా కూడా నష్టపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఖాయమన్నారు. కనుపుదశలో ఉన్న చేలలో కలుపు పేరుకుపోయింది, నీరు లేకపోవడంతో కూలీలు తీయలేమంటున్నారు. కలుపు తొలగించకపోతే దిగుబడి పడిపోతుందన్నారు.

Updated Date - 2021-02-06T05:16:08+05:30 IST