నేటి నుంచి కర్ఫ్యూ
ABN , First Publish Date - 2021-04-24T05:13:50+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కారణంగా ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను విధించింది. జిల్లావ్యాప్తంగా రాత్రి పది నుంచి ఉదయం ఐదు గంటల వరకు కఠిన నిబంధనలను అమలు చేయనున్నారు.
రాత్రి 10 నుంచి.. ఉదయం 5 గంటల వరకు
ఆ సమయంలో ఎవరూ బయటకు రావద్దు
ఏలూరు క్రైం, ఏప్రిల్ 23 : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కారణంగా ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను విధించింది. జిల్లావ్యాప్తంగా రాత్రి పది నుంచి ఉదయం ఐదు గంటల వరకు కఠిన నిబంధనలను అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో అత్యవసర సేవ లకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ కారణం లేకుండా బయటికి వచ్చిన వారిపై గతంలో లాగే కేసులు నమోదు చేసే అవకాశాలు ఉ న్నాయి. ఇప్పటికే జిల్లాలోని చాలా ప్రాం తాల్లో రోజూ సాయంత్రం ఆరు నుంచి ఉద యం ఆరు గంటల వరకూ వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను కట్టివేస్తున్నారు. రెండు రోజుల నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ప్రతీ రోజూ ఇదే విధంగా కొన సాగుతుంది. జిల్లాలో అత్యధికంగా ఏలూరు, జంగారెడ్డి గూడెం, కొయ్యలగూడెం, ఉండి, పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం మండలాల్లో కరోనా బాధితు లు పెరుగుతున్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో కర్ఫ్యూతోపాటు అదనంగా కొవిడ్ నిబంధనలు తూచా తప్పకుండా ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. ఎస్పీ కె.నారాయణ నాయక్, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు రోజూ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు.
కొత్తగా 190 పాజిటివ్ కేసులు
ఏలూరు ఎడ్యుకేషన్, ఏప్రిల్ 23 : కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా నిర్ధారణ అవుతున్న కేసుల్లో ఏలూరులోనే సుమారు 200 మంది పాజిటివ్ బాధితులతో తొలి స్థానంలో ఉంది. బాధితుల్లో అన్ని వయసుల వారు ఉన్నారు. శుక్రవారం నమోదైన 190 కేసులతో జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య 975కి చేరింది. సాయంత్రం వరకు వెల్లడైన టెస్టుల ఫలితాల్లో ఏలూరు, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెంలలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఐదు లోపు పాజిటివ్ కేసులు నమోదైన 34 ప్రాంతాలను గుర్తించి మైక్రో కంటైన్మెంట్ జోన్లను ఏర్పా టు చేయనున్నారు. ఇప్పటికే 20 జోన్ల ను ఏర్పాటు చేసిన విషయం విదిత మే. ఏలూరు ఆర్ఆర్ పేట, చాటపర్రులలో పాజిటివ్ కేసులు నమోదైనచోట ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం వెల్లడైన కొవిడ్ టెస్టుల ఫలితాల్లో జంగారెడ్డిగూడెం, ముత్యాలవారిపాలెం, కోపల్లె, కొత్తూరు పాఠశాలల్లో ఐదుగురు టీచర్లకు, ఉండి, చెరకువాడల్లో ఇద్దరు పాఠ శాల విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
ఆశ్రంలో ఒక్కరోజే నలుగురు మృతి
ఏలూరు టూ టౌన్, ఏప్రిల్ 23 : ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో ఇప్పటి వరకూ 219 మంది కరోనాతో బాధ పడుతూ వైద్యం తీసుకుంటున్నారని కొవిడ్ ఇన్ఛార్జి డాక్టర్ రవికుమార్ తెలిపారు. ఈ నెల 17 నుంచి ఆశ్రం ఆసుపత్రిని కొవిడ్ ఆసుపత్రిగా మార్చారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కరోనాతో చికిత్స పొందుతూ ఎనిమిది మంది మరణించారన్నారు. శుక్రవారం ఒక్క రోజే నలుగురు మృతి చెందారన్నారు.
కరోనాతో హెచ్ఎం మృతి
పోడూరు, ఏప్రిల్ 23 : మట్టపర్రు ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు(48) కరోనాతో గురు వారం రాత్రి మృతి చెందారు. ఆయనకు జ్వరం రావ డంతో గురువారం కరోనా పరీక్ష చేయించుకోగా పాజి టివ్ వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం కిమ్స్లో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇరగవరం మండలం రేలంగిలో కరోనాతో 32 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మూడు వేల డోసుల పంపిణీ
ఏలూరుఎడ్యుకేషన్, ఏప్రిల్ 23 : జిల్లాలో శుక్రవారం మూడు వేల డోసుల కోవిషీల్డ్ నిల్వలతో ప్రారంభమైన వ్యాక్సిన్ పంపిణీ 39 పీహెచ్సీలు, ప్రభుత్వాసుపత్రులు, మూడు ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో జరిగింది. హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లు, సీనియర్ సిటిజన్లకు తొలి డోసు, రెండో డోసు వేయడంతో సాయంత్రానికి నిల్వలన్నీ ఖాళీ అయ్యాయి. రెండో డోసు 80 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్టు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా కొత్తగా వ్యాక్సిన్ నిల్వలు వస్తే తప్ప శనివారం వ్యాక్సినేషన్ ప్రారంభం కాదు.
న్యాయ సలహాలు ఇక ఫోన్లోనే
ఏలూరు క్రైం, ఏప్రిల్ 23 : జిల్లా న్యాయసేవాధికార సంస్థ నుంచి సలహాలు అవసరమైన వారు ఇకపై ఫోన్ ద్వారానే పొందాలని సంస్థ ఛైర్మన్, జిల్లా జడ్జి ఇ భీమారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనల కారణంగా భౌతికంగా న్యాయ సలహాలు ఇవ్వలేనందున, కక్షిదారులు వారి కేసుల్లో న్యాయ సల హాలు, సహాయం కావాల్సిన వారు 08812–224555, 08812–227655, 97041 27956, 92901 16691 లేదా నేషనల్ లీగల్ హెల్ప్లైన్ నెంబర్ 15100ను సంప్రదించాలని కోరారు.
సచివాలయాల ఆధారంగా కంటైన్మెంట్
కలెక్టర్ కార్తికేయ మిశ్రా
ఏలూరు, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి):కొవిడ్ కేసుల ని యంత్రణకు సచివాలయాల పరిధి ఆధారంగా కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దారులను ఆదేశిం చారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం ఆయన సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దారులు, ఎంపీ డీవోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. కొవిడ్ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు పటిష్టంగా ఏర్పాటు చేయాలన్నారు. బారికేడింగ్ కట్టు దిట్టంగా ఉండాలన్నారు. కంటైన్మెంట్ జోన్లను ఎస్పీతో కలిసే తానే స్వయంగా పరిశీలిస్తానని స్పష్టం చేశారు. కంటైన్మెంట్లలో మెరుగైన పారిశుధ్యం ఉండాలన్నారు. జిల్లాలో 8 కొవిడ్ కేర్ సెంటర్లు(ట్రిపుల్ సీ)లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించామని, వీటిలో 4,500 బెడ్లు సిద్ధం చేయాలన్నారు. ‘ట్రిపుల్ సీ’లకు జేసీ హిమాన్షు శుక్లాను ప్రత్యేక అధికారిగా నియమిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు, భీమవరం పట్టణాల్లో మాంసం, చేపలు, కూరగాయల మార్కెట్లను బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. మండలానికి ఒక కొవిడ్ ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు. మే 1 నుంచి 18 నుంచి 45 మధ్య వయసు వారికి టీకా వేస్తామని తెలిపారు. అధికారులందరూ సిద్ధంగా ఉండాలని, కార్యస్థానాన్ని వదిలి వెళ్లరాదని ఆదేశాలు జారీచేశారు. ఎస్పీ నారాయణ నాయక్ మాట్లాడుతూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. రాత్రి ఎనిమిది గంటలకే షాపులు మూసేయాలన్నారు. సినిమా హాళ్లలో రెండో ఆటను నిలిపి వేశామన్నారు.