టీకా ఉత్సవ్
ABN , First Publish Date - 2021-04-11T05:46:13+05:30 IST
జిల్లావ్యాప్తంగా తగినన్ని డోసుల టీకా మందు నిల్వలు లేవు. కానీ, ఆదివారం నుంచి నాలుగు రోజులపాటు స్పెషల్ డ్రైవ్గా నిర్వహించనున్న టీకా ఉత్సవ్ మొదలు కానుంది.
నిల్వలు లేకుండానే.. నేటి నుంచి 14 వరకు
ఉన్నది 7,850 డోసులు.. వేయాల్సింది 35 వేలకు పైగా
పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్కు సిద్ధం
ఏలూరు ఎడ్యుకేషన్, ఏప్రిల్ 10 : జిల్లావ్యాప్తంగా తగినన్ని డోసుల టీకా మందు నిల్వలు లేవు. కానీ, ఆదివారం నుంచి నాలుగు రోజులపాటు స్పెషల్ డ్రైవ్గా నిర్వహించనున్న టీకా ఉత్సవ్ మొదలు కానుంది. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 11 వేల కుపైగా డోసుల టీకా మందు వినియోగం జరుగుతుండగా, శనివారం ఉదయానికి కేవలం 7,850 డోసుల నిల్వలు మాత్ర మే పీహెచ్సీలు, ప్రభుత్వాసుపత్రుల్లోని కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఉన్నాయి. మరోవైపు శనివారం రాత్రికల్లా కొత్తగా 10 వేల డోసుల వ్యాక్సిన్ జిల్లాకు వస్తాయని తొలుత సంకే తాలందినా అది వాస్తవ రూపం దాల్చేలా పరిస్థితులు కనిపిం చడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎంపికచేసిన 68 గ్రామ/వార్డు సచివాలయాల్లో కోవా గ్జిన్ టీకా మందు కొరత వల్ల పంపిణీని గురువారం నుంచే నిలిపివేయగా, తక్షణమే తగినన్ని నిల్వలు జిల్లాకు అందకపో తే పీహెచ్సీలు, ప్రభుత్వాసుపత్రుల్లో ‘వ్యాక్సిన్.. నో’ అనే పరి స్థితులు కొద్ది రోజుల్లోనే ఏర్పడే అవకాశాలున్నాయి. మరోవైపు పీహెచ్సీలు, ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులోవున్న కొద్ది పాటి నిల్వలతోనే వ్యాక్సినేషన్ను నెట్టుకొచ్చేందుకు అనధికారి కంగా రోజువారీ డోసుల పంపిణీలో స్థానిక వైద్యాధికారులు పరిమితులు విధించేలా మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఇక పెద్ద ఎత్తున తలపెట్టిన టీకా ఉత్సవ్కు క్షేత్రస్థాయి ఏర్పాట్లు పకడ్బందీగా చేసినా దీనికనుగుణంగా టీకా మందు కోసం లబ్ధిదారుల నుంచి వచ్చే భారీ స్పందనను ఎలా తట్టుకోవాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వర్గాలకు తెలియడం లేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందే వ్యాక్సిన్ నిల్వల నుంచి జిల్లాకు సరఫరా చేసే డోసుల సంఖ్యపైనే ఆదివారం నుంచి బుధవారం వరకు నిర్వహించనున్న టీకా ఉత్సవ్ సక్సెస్ అంశం ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు.
భారీగా లబ్ధిదారుల గుర్తింపు
టీకా ఉత్సవ్లో 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వే యాలని నిర్దేశించారు. తొలిరోజు ఆదివారం జిల్లావ్యాప్తంగా పీ హెచ్సీలు, యూహెచ్సీల పరిధిలో మొత్తం 83 గ్రామ/వార్డు సచివాలయాలను ఎంపిక చేసి 39,019 మంది లబ్ధిదారులకు టీకా మందు వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. బుధవా రం వరకు రోజుకు 71 సీవీసీలలో వ్యాక్సినేషన్ జరుగుతుంది. టీకా ఉత్సవ్కు సింహభాగం సీవీసీలను ఏలూరు అర్బన్, రూ రల్లలో మొత్తం 22 ఏర్పాటు చేయగా, జిల్లాలో తాడేపల్లిగూ డెంలో నాలుగు, భీమవరం, నరసాపురంలలో మూడేసి చొప్పు న, పాలకొల్లులో రెండు, మిగతా మండలాల్లో పీహెచ్సీల పరిధిలో ఒక్కో గ్రామ సచివాలయం చొప్పున నాలుగు రోజుల పాటు వారికి వ్యాక్సిన్ వేస్తారు. టీకా మందుకు లబ్ధిదారులను గుర్తించినప్పటికీ దీనికి అనుగుణంగా తగినంత మోతాదులో నిల్వలు లేకపోతే పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్ధకంగా మారింది.
32 కొవిడ్ కేసులు నమోదు
జిల్లాలో శనివారం 32 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏలూరులో ఆరు, చింతలపూడి, కొవ్వూరులలో మూడేసి చొప్పు న, గణపవరం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లిలలో రెండేసి చొప్పున నమోదుకాగా మిగతా కేసులు భీమవరం, బుట్టాయి గూడెం, కాళ్ళ, పెదపాడు, పెనుగొండ, పెదవేగి, టి.నర్సాపురం, ఉండ్రాజవరం, తాడేపల్లిగూడెంలలో నమోదయ్యాయి. నరసా పురం మండలంలో ముగ్గురు టీచర్లకు, కొవ్వూరు మండలంలో ఒక ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయునికి, నరసాపురం మండ లంలో ఒక విద్యార్థికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
ఉండి ఎమ్మెల్యే రామరాజుకు పాజిటివ్
కాళ్ళ, ఏప్రిల్ 10: ఉండి ఎమ్మె ల్యే మంతెన రామరాజుకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 2న తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లిన ఆయనకు నాలుగు రోజులుగా ఆరోగ్యంలో తేడా రావడంతో టెస్ట్లు చేయించుకున్నారు. టెస్టుల్లో పాజిటివ్ రావడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లి ఏఐజీ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ఎవరూ అందోళన చెందవద్దని కార్యకర్తలకు సూచించినట్లు తెలిపారు.
ఆరోగ్య శాఖ మంత్రి నానికి వ్యాక్సిన్
ఏలూరు క్రైం, ఏప్రిల్ 10: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళకాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) సాధారణ పౌరుడిలా ఏలూ రు ప్రభుత్వాసుపత్రిలో వున్న వ్యాక్సిన్ కేంద్రానికి వచ్చి కరో నా వ్యాక్సిన్ వేయించుకుని వెళ్ళారు. ఎటువంటి సమాచా రం లేకుండా ఆయన సొంత కారులో ఆసుపత్రికి వచ్చి రిజిస్ట్రేషన్ రూముకు వెళ్ళి వివరాలు నమోదు చేయించు కుని వ్యాక్సిన్ వేయించుకున్నారు. అనంతరం వైద్యుల పర్య వేక్షణలో పావు గంటపాటు అక్కడే ఉండి వచ్చారు. వ్యాక్సి న్ కోసం వచ్చిన వారితో మాట్లాడారు. వ్యాక్సిన్కు ఎక్కువ సమయం పడుతుందని చెప్పడంతో వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఏవిఆర్ మోహన్ను ఆదేశించారు.
వ్యాక్సిన్పై అపోహలొద్దు
‘వ్యాక్సిన్పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. పోలీసు శాఖలో 96 శాతం మంది మొదటి డోస్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు’ అని ఏఆర్ అదనపు ఎస్పీ ఎం.మహేష్ కుమార్ చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ రెం డో డోసు వేయించుకోవడానికి వచ్చిన ఆయన మాట్లాడా రు. పోలీస్ సిబ్బందికి రెండో డోస్ శనివారం నుంచి ప్రారం భమైందని చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుని తమ ప్రాణాలతోపాటు, ఎదుటి వారి ప్రాణాలు కాపాడా లని సూచించారు. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు మాస్క్ తప్పని సరిగా ధరించాలన్నారు.
సెకండ్ వేవ్ ప్రమాదకరం : చీఫ్ ఫిజీషియన్ డాక్టర్ పోతుమూడి
ఏలూరు క్రైం, ఏప్రిల్ 10 : కరోనా లక్షణాలు కనిపిస్తే.. వెంటనే ఆసుపత్రికి వచ్చి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని ఏలూరు ప్రభుత్వాసుపత్రి చీఫ్ ఫిజీషియన్ డాక్టర్ పోతుమూడి శ్రీనివాసరావు చెప్పారు. ‘పాలకొల్లు, నర్సాపురం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో ఎక్కువగా కరోనా వేవ్ – 2 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారికి పాజిటివ్ బయటపడుతోంది. అలా వెళ్లి వచ్చిన వారు పరీక్షలు చేయించుకుని, ఫలితాలు వచ్చే వరకూ వేరుగా ఉండడం మంచిది. ప్రస్తుతం జ్వరం, ఆయాసం, దగ్గు, విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు కలిగిన వారిలో వేవ్ టు పాజిటివ్గా గుర్తిస్తున్నాం. ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన వారిలో నాలుగు నుంచి ఆరు రోజులలోపే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఈ నేపథ్యంలో ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించి, చేతులను శుభ్రపర్చుకోవాలి. సామాజిక దూరం పాటించాలి. ఎవరైనా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయితే వైద్యులను సంప్రదిస్తే.. హోం ఐసొలేషనా, ఆసుపత్రిలో చేరడమా అనేది నిర్ధారిస్తారు. ఎవరూ సొంతంగా నిర్ణయాలు తీసుకుని తమ ప్రాణాలను పోగొట్టుకోవదు. ప్రస్తుతం వైరస్ ఎంతో ప్రమాదకరమైంది. ఎవరూ అధైర్యపడవద్దు. 24 గంటలూ ఏలూరు ప్రభుత్వాసుపత్రి పనిచేస్తుంది’ అని ఆయన సూచించారు.