ఉపాధి బకాయిలు చెల్లించాలి
ABN , First Publish Date - 2021-08-03T05:57:33+05:30 IST
ఉపాధి పనుల పెండింగ్ బిల్లులను చెల్లించాలంటూ టీడీపీ నాయకులు సోమవారం ఆందోళన చేపట్టారు.

ఎంపీడీవో కార్యాలయాల వద్ద టీడీపీ నిరసనలు
కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారని ధ్వజం
ఉపాధి పనుల పెండింగ్ బిల్లులను చెల్లించాలంటూ టీడీపీ నాయకులు సోమవారం ఆందోళన చేపట్టారు. బకాయిలు చెల్లించాలని కోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం సొమ్ము చెల్లించాలంటూ ఎంపీడీవో కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపి అధికారులకు వినతిపత్రాలను అందించారు.
పాలకొల్లు రూరల్, ఆగస్టు 2: గతంలో చేసిన ఉపాధి పనులకు పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని ఎమ్మెల్యే రామానాయుడు డిమాండ్ చేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో బైఠాయించారు. అనం తరం ఎంపీడీవో సంగాని వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ. 2500కోట్ల బిల్లులు బకాయిలు ఉన్నాయని, వాటిపై 24 శాతం వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్న అధికారులపై చర్యలు తప్పవన్నారు. కోడి విజయ భాస్కర రావు, నెక్కంటి ఆదినారాయణ, తాళ్ళూరి సూర్య ప్రకాశరావు, సత్యనారాయణ రాజు, అందే కోటి వీరభద్రరావు, శాగ సత్యనారాయణ, ధనాని ప్రకాశ్, దుర్గా పెద్దిరాజు, చిట్టూరి ఆంజనేయులు, పెన్మెత్స రామభద్రరాజు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం రూరల్: మండల పరిషత్ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 జూన్ లోపు చేపట్టిన ఉపాధి పనుల బిల్లులను చెల్లించాలని కోర్టు అదేశాలు జారీ చేసినా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం టీడీపీ హయాంలో కాంట్రాక్టర్లు రూ. 2,500 కోట్ల విలువైన పనులు చేశారని, జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత బిల్లులు చెల్లించకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తక్షణమే నిధులు మం జూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవో ప్రసాద్ యాదవ్కు వినతిపత్రం అందించారు. టీడీపీ నాయకులు చిటికెల రామ్మోహన్రావు, అకన సుబ్రమణ్యం, శ్రీరాయుడు శ్రీరాములు, వాతాడి ఉమా, కొట్టు పండు, పాలూరి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
పెనుగొండ: కోర్టు ఆదేశాల మేరకు ఉపాధి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆచంట నియోజకవర్గ పరిధిలో ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరుతూ నియోజకవర్గస్థాయి లో పెనుగొండలో తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో పురుషోత్తం లకు వినతిపత్రాలు అందించారు. సర్పంచ్ నక్కా శ్యామలా సోని, నాయకులు గొడవర్తి శ్రీరాములు, కేతా మీరయ్య, గంధం వెంకటరాజు, కటికిరెడ్డి నానాజీ, పులుగోరు రవికుమార్, మండ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం అర్బన్: పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టౌన్ కన్వీనర్ వేండ్ర శ్రీనివాస్ మాట్లాడుతూ అధిష్ఠానం పిలుపు మేరకు అన్ని మండల కార్యాలయాల వద్ద నిరసన చేపట్టామన్నారు. భీమవరం మండలంలోని పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని వినతి పత్రం సమర్పించామన్నారు. టీడీపీ నాయకులు మేరగాని నారాయణమ్మ, రేవు వెంకన్న, కౌరు పృథ్వి శంకర్, కెల్లా చిన్నంనాయుడు, మైలాబత్తుల ఐజాక్ బాబు తదితరులు పాల్గొన్నారు.
వీరవాసరం: ఉపాధి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని టీడీపీ మండల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం ఇన్చార్జ్ ఎంపీడీవో పి శ్యామ్యూల్కు వినతిపత్రం ఇచ్చారు. మండల అధ్యక్ష, కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాసరావు, వీరవల్లి శ్రీనివాసరావు, వీరవల్లి చంద్రశేఖర్, రాయపల్లి వెంకట్, గొర్రె కృష్ణమూర్తి, కడలి వాసు తదితరులు పాల్గొన్నారు.