తూకంలో దగా..
ABN , First Publish Date - 2021-05-20T05:43:37+05:30 IST
తక్కువ తూకంతో బియ్యం బస్తాలను తాడేపల్లిగూడెం మండల స్టాక్ పాయింట్ అధికారులు అంటగడుతున్నారని డీలర్లు ఆరోపి స్తున్నారు.

50 కిలోల బస్తాకు వచ్చేది 47.50 కిలోలే
ఈ పోస్ తూకం లేకుండానే బియ్యం పంపిణీ
నష్టపోతున్నామంటున్న రేషన్ డీలర్లు
పట్టించుకోని అధికారులు?
తక్కువ తూకంతో బియ్యం బస్తాలను తాడేపల్లిగూడెం మండల స్టాక్ పాయింట్ అధికారులు అంటగడుతున్నారని డీలర్లు ఆరోపి స్తున్నారు. 50కిలోలు ఉండాల్సిన బస్తా 47.50 నుంచి 49 కేజీల లోపు ఉంటోందని వాపోతున్నారు.
నల్లజర్ల, మే 19: మండల స్టాక్ పాయింట్ నుంచి రేషన్ డీలర్లకు ఈ పోస్ యంత్రంపై ప్రతి బస్తా తూకం వేసి 50 కేజీలకు అదనంగా మరో 580 గ్రాముల సంచి బరువు కలిపి అప్పగించాలని నిబంధనలు ఉన్నా ఈ పోస్ పని చేయడం లేదని సాకులు చెప్పి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ పోస్ యంత్రం ద్వారా తూకం వేసి లోడ్ చేయవలసిన హమాలీలు సైతం అధికారులతో కుమ్మక్కవుతున్నారన్న ఆరోప ణలు న్నాయి. స్టేజ్–1 నుంచి స్టేజ్ –2కి ఈ పోస్ యంత్రం ద్వారా తూకం వేసి హమాలీలు డీలర్లకు పంపాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్ 1 వద్ద ఎగుమతి చేసిన బియ్యాన్ని స్టేజ్–2కు పంపకుండా నేరుగా డీలర్లకు పంపుతున్నారు. దీంతో డీలర్కు తరుగు రావడంతో పాటు ప్రభుత్వానికి హమాలీలు పనిచేయకుండానే సొమ్ము చెల్లించవలసి వస్తోంది.
గోనె సంచి బరువు సైతం తగ్గించకుండానే మండల స్టాక్ పాయింట్ అధికారులు డీలర్లకు అన్యాయం చేస్తున్నారని నల్లజర్ల మండల డీలర్ల సంఘ అధ్యక్షుడు చీమకుర్తి నరసింహమూర్తి ఆరోపిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు స్పందించి తాడేపల్లిగూడెం మండల స్టాక్ పాయింట్పై విచారణ జరిపించాలన్నారు. ఈ స్టాక్ పాయింట్ ద్వారా నల్లజర్ల, పెంటపాడు, తాడేపల్లిగూడెం టౌన్, రూరల్, పెంటపాడు, గణపవరం, నిడమర్రు మండలాల డీలర్లకు సరుకు వెళుతుందన్నారు.
స్పందించని టీఏ
దీనిపై వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా మండల స్టాక్ పాయింట్ అధికారి (టీఏ)శ్రీనివాస్ స్పందించలేదు.