కదిలిన సచివాలయాలు
ABN , First Publish Date - 2021-08-11T05:07:57+05:30 IST
జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాల భవనాల్లో కొనసాగుతున్న సచివాలయాలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి.
![కదిలిన సచివాలయాలు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921081011351181/08102021233538n50.jpg)
పాఠశాలల నుంచి ఇతర ప్రాంతాలకు ఆగమేఘాలపై తరలింపు
ఉన్నత న్యాయస్థానం మొట్టికాయలతో ప్రభుత్వంలో చలనం
పాలకొల్లు, ఆగస్టు 10: జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాల భవనాల్లో కొనసాగుతున్న సచివాలయాలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. వాటిని అద్దె భవనాల్లోకి మార్చేందుకు అధికారులు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల అద్దె భవనాలు దొరకగా మరికొన్నిచోట్ల వెతుకులాటలో పడ్డారు. అధికారులకు పాఠశాలల్లో నిర్వహిస్తున్న సచివాలయాలను వెంటనే మార్చాలని మౌఖికాదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశా లల ఆవరణల్లో గ్రామ, వార్డు సచివాలయాలను తొలగించాలని, గతే డాది జూన్లోనే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. తాజాగా ఐఏఎస్ అధికారు లను సైతం కోర్టు కు పిలిపించిన నేపఽథ్యంలో సచివాలయాల తరలింపునకు అధికారులు హడావుడి పడుతున్నారు. పాఠశాలల్లో ఏర్పాటుచేసిన సచివాలయా లను యుద్ధ ప్రాతిపాదికన తరలిస్తున్నారు. సచివాలయ వ్యవస్థ తెర పైకి తెచ్చిన వెంటనే ఎక్కడ జాగా దొరికితే అక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా పాఠశాలల్లో ఉన్న సచివాలయా లను ఆఘమేఘాల మీద తరలించే పనుల్లో ఉన్నారు.
పాలకొల్లు పురపాలక సంఘంలో ఆరుచోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో సచివాలయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు వీటిని ఇతర ప్రైవేటు భవ నాల్లోకి మార్చేందుకు పురపాలక అధికారులు దృష్టి సారించారు. ఇప్ప టికే కొన్నింటికి ప్రైవేటు భవనాలు దొరకడంతో అక్కడకు మారేందుకు సచివాలయ ఉద్యోగులు సామాగ్రిని తరలించే పనుల్లో ఉన్నారు. జిల్లా లోని ఏలూరు నగరంతోపాటు అన్ని పట్టణాలు, గ్రామాల్లోని పాఠ శాలల్లోవున్న సచివాలయాలను మార్చేపనిలో అధికారులు నిమగ్న మయ్యారు. జిల్లాలో వందకుపైగా పాఠశాలల్లో సచివాలయాలు నడుస్తున్నట్లు సమాచారం. పాఠశాలల ప్రాంగణాలలో సచివాలయాలు ఏర్పాటుపై మొదట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇరుకు గదులు, చాలీచాలని ఫర్నీచర్తో నడుస్తున్న పాఠ శాలల్లో కొత్తగా సచివాలయాలను నడిపితే విద్యార్థులకు మరింత ఇబ్బందులు తలె త్తుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. దీనిపై అప్పట్లో ప్రభుత్వం పట్టించుకోకపోయినా ఇప్పుడు హైకోర్టు సీరియస్ అవడంతో వాటిని తరలిస్తున్నారు.