సార్వా చెల్లింపులు జాప్యం

ABN , First Publish Date - 2021-12-31T05:58:31+05:30 IST

ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నా సొమ్ములు జమ చేయడంలో జాప్యం జరుగుతోంది.

సార్వా చెల్లింపులు జాప్యం

కొనుగోలు చేసిన ధాన్యం 4.75 లక్షల టన్నులు

రైతులకు ఇవ్వాల్సింది రూ.922.70 కోట్లు

ఇచ్చింది రూ.121 కోట్లు

సొమ్ముల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలు


ఏలూరుసిటీ, డిసెంబరు 30 : ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నా సొమ్ములు జమ చేయడంలో జాప్యం జరుగుతోంది. దీంతో రైతులు పెట్టుబడు లకు సొమ్ములు లేక లబోదిబోమంటున్నారు. జిల్లాలో 874 ఆర్బీకేలలో ధాన్యం కొనుగోళ్లు చేయాలని నిర్ణయించగా ఇప్పటివరకు 800 కేంద్రాలలో 4.75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. రూ.922.70 కోట్లు విలువైన ధాన్యం కొనుగోలు చేయగా రైతులకు ఇప్పటివరకు రూ.121 కోట్లు చెల్లింపులు చేశారు. 53,819 మంది రైతులు ధాన్యం అమ్మకాలు చేయగా ఇప్పటివరకు 6,323 మంది రైతులకు సొమ్ములు చెల్లించారు. ఈసారి ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజులకు వారివారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు జమ చేస్తున్నారు. కొంతమంది రైతులకు 21 రోజులు దాటినా సొమ్ములు అందని పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో ధాన్యం సొమ్ములు చెల్లించారు. రబీ పెట్టుబడులకు సొమ్ములు అందక ప్రైవేటు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు రైతులకు రూ.121 కోట్లు చెల్లించామని మరో రూ.77 కోట్లకు సంబ ంధించి బ్యాంకులకు స్టేట్‌మెంట్లు పంపించినట్టు సివిల్‌ సప్లయిస్‌ డీఎం రాజు తెలిపారు. మిగిలిన సొమ్ములు కూడా రైతులకు సకాలంలో చెల్లిస్తామని వివరించారు.

Updated Date - 2021-12-31T05:58:31+05:30 IST