అర్బన్ ప్రాంతాల్లో ఇంటింటికీ రేషన్
ABN , First Publish Date - 2021-02-02T05:21:35+05:30 IST
అర్బన్ ప్రాంతాల్లో ఇంటిం టికీ రేషన్ పంపిణీ ప్రారంభమైంది.

ఏలూరు సిటీ, పిబ్రవరి 1: అర్బన్ ప్రాంతాల్లో ఇంటిం టికీ రేషన్ పంపిణీ ప్రారంభమైంది. ఏలూరు నగరంతో పాటు అన్ని మున్సిపాల్టీలలో సోమవారం ఈ పథకాన్ని ప్రారంభించారు. పట్టణాల్లో రెండు లక్షల వరకు రేషన్ కార్డులుండగా ప్రత్యేకంగా రూపొందించిన 126 వాహనాల ద్వారా రేషన్ డిపోల నుంచి సరుకులు తీసుకుని కార్డుదారుల ఇంటికి వెళ్లి సరుకులను అందజేస్తున్నారు. అర్భన్ పరిఽధిలో మొత్తం 337 చౌకడిపోలు ఉండగా వాటికి ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా రేషన్ సరఫరా అయ్యింది. రేషన్ డిపోల నుంచి డోర్ డెలివరీవాహన దారుడు సరుకులు తీసుకుని రేషన్ కార్డుదారుని ఇంటికి వెళ్లి బయోమెట్రిక్ తీసుకుని సరుకులు అందించారు. ఏలూరులో సుబ్బమ్మదేవి హైస్కూల్ సమీపంలో పాముల దిబ్బ వద్ద జేసీ వెంకట రమణారెడ్డి పరిశీలించారు. జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి సుబ్బరాజు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరు దాసి రాజు పాల్గొన్నారు. తణుకు, తాడేపల్లి గూడెం, జంగారెడ్డిగూడెం, భీమవరం, నరసా పురం, పాలకొల్లు, నిడదవోలు, కొవ్వూరు ప్రాంతాల్లో డోర్ డెలివరీ మొదలైందని సుబ్బరాజు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో గ్రామాల్లో ఈ నెల ఇంటింటికీ రేషన్ పంపిణీ లేనట్లే. దీనిపై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక చౌక డిపోల ద్వారా సోమవారం రేషన్ సరుకులు పంపిణీ ప్రారంభం కాలేదు. రెండు రోజుల్లో పంపిణీ జరిగే అవకాశాలున్నాయి.