పోలీసుల అసాధారణ సేవల వల్లే శాంతి : ఎస్పీ
ABN , First Publish Date - 2021-10-29T04:54:05+05:30 IST
శాంతి స్థాపన కోసం ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలు వృఽథా కావని, పోలీసులు అసాధారణమైన సేవలందిం చటం వల్లనే సమాజంలో శాంతి నెలకొందని జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ అన్నారు.
గణపవరం, అక్టోబరు 28: శాంతి స్థాపన కోసం ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలు వృఽథా కావని, పోలీసులు అసాధారణమైన సేవలందిం చటం వల్లనే సమాజంలో శాంతి నెలకొందని జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ అన్నారు. గురువారం గణపవరంలో పోలీసు స్టేషన్ భవనాన్ని, అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పురస్కరించుకుని మెడికల్ క్యాంపు, రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ మాట్లాడుతూ పోలీస్ అమరుల ఆశయాల సాధన కోసం శక్తివంచనలేకుండా కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఓ.దిలీప్కిరణ్, సీఐ వి.వెంకటేశ్వరరావు, గణపవరం ఎస్సై వీరబాబు, చేబ్రోలు ఎస్సై స్వామి, ఎంపీపీ దండు వెంకటరామరాజు(రాము), పాల్గొన్నారు.
నిడదవోలు: యువత రక్తదాన శిబిరాల్లో భాగస్వాములు కావాలని సీఐ కేఏ స్వామి అన్నారు. గురువారం పట్టణంలోని రోటరీ ఆడిటోరియంలో పోలీస్ అమరవీరుల దినం పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో నిడదవోలు, సమిశ్రగూడెం, చాగల్లు పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. రక్తదానం చేసిన వారికి జ్ఞాపికలు అందజేశారు.
తాడేపల్లిగూడెం రూరల్: ప్రజలకు రక్షణ కల్పించేందుకు పోలీసులు పడుతున్న కష్టాలను ప్రజలకు తెలియజేయాలనే ఖాకీ సినిమా చూపిస్తున్నామని సీఐ ఆకుల రఘు తెలిపారు. తాడేపల్లిగూడెంలోని శేషమహాల్ థియేటర్లో విద్యార్థులు, పోలీస్ సిబ్బందికి గురువారం ఖాకీ సినిమా చూపించారు. ఈ సందర్బంగా వారితో కలిసి సీఐ రఘు, ఎస్ఐలు జీజే ప్రసాద్, బి.రాజు, ఉపాధ్యాయ సిబ్బంది వీక్షించారు.