పుర సమస్యలపై సభ్యుల గళం
ABN , First Publish Date - 2021-10-26T05:01:00+05:30 IST
పారిశుధ్యం, పెండింగ్ పనులు, వీధి లైట్లు నిర్వహణపై స్వపక్ష, విపక్ష సభ్యులు గళం విప్పారు.

వాడివేడిగా నరసాపురం మునిసిపల్ కౌన్సిల్ సమావేశం
నరసాపురం, అక్టోబరు 25:పారిశుధ్యం, పెండింగ్ పనులు, వీధి లైట్లు నిర్వహణపై స్వపక్ష, విపక్ష సభ్యులు గళం విప్పారు. సోమవారం చైర్పర్సన్ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో అధికారి పార్టీ సభ్యులు వన్నెంరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ డ్రెయిన్లలో సిల్ట్ ఎందుకు తీయడం లేదంటూ ప్రశ్నించారు. దీనికి విఫ్ బొంతు రాజశేఖర్ అండగా నిలిచారు. తన వార్డులో చేపట్టిన డ్రెయిన్ పనుల్ని ఎందుకు నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీసీ కామన నాగిని కూడా వార్డుల్లో పర్యటిస్తుంటే.. ప్రజలు డ్రెయిన్ల నిర్వహణపై నిల దీస్తున్నారన్నారు. చాలా వార్డుల్లో డస్ట్ బిన్నులు ఇవ్వకుండా చెత్త పన్ను ఎలా వసూలు చేస్తున్నారంటూ సఖినేటిపల్లి సురేష్ ఆగ్రమం వ్యక్తం చేశారు. టెండర్ పిలిచిన పనులను ఎందుకు రద్దు చేస్తున్నారంటూ స్వతంత్ర సభ్యులు కోటిపల్లి సురేష్, యర్రమిల్లి కాంప్ల్లెక్స్లోని షాపులను రిజర్వేషన్ ప్రకారం ఎస్సీలకు ఇవ్వాలని కౌన్సిలర్లు శ్రీకాంత్, దిలీప్ కోరారు. ప్రతి సమావేశంలోనూ సమస్యలు చెబుతున్నాం.. కానీ ఒక్కటి కూడా పరిష్కారం కావడం లేదని టీడీపీ సభ్యులు పాలూరి బాబ్జి సీరియస్ అయ్యారు. కమిషనర్ సత్యవేణి, మేనేజర్ శివాజీ, ఏఈ సునీల్, టీపీవో టి బాలాజి పాల్గొన్నారు.
