అడవికొలను గ్రామస్థులకు అండగా ఉంటాం

ABN , First Publish Date - 2021-08-31T05:25:00+05:30 IST

పోలీసులు ప్రజా సేవకులా ? లేక అధికార పార్టీ సేవకులా? అంటూ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మండిపడ్డారు.

అడవికొలను  గ్రామస్థులకు  అండగా ఉంటాం
అడవికొలనులో విలేకరులతో మాట్లాడుతున్న జనసేన పార్టీ జిల్లా అఽధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు

బాధితులను పరామర్శించిన జనసేన జిల్లా అధ్యక్షుడు, నాయకులు

నిడమర్రు ఆగస్టు 30 : పోలీసులు ప్రజా సేవకులా ? లేక  అధికార పార్టీ సేవకులా? అంటూ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మండిపడ్డారు. సోమవారం అడవికొలనులో తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్‌ బొలిశెట్టి శ్రీనివాస రావు, ఇతర జిల్లా నాయకులు పర్యటించారు. ఆదివారం రహదారి నిర్మాణం కోసం ర్యాలీ నిర్వహిస్తూ పోలీసుల లాఠీ దెబ్బలు తిని, అరెస్టయిన వారిని పరామర్శించారు. అనం తరం విలేకరులతో గోవిందరావు మాట్లాడుతూ పార్టీలకతీతంగా రోడ్డు కోసం పోరాటం చేస్తుంటే అరెస్టు చేయడం దారుణమని, ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. గ్రామస్థులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో రోడ్లు అస్తవ్యస్తంపై వచ్చే నెల 2వ తేదీ నుంచి నిరసన ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. బొలిశెట్టి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలన రాజ్యమేలుతుం దని, అడవికొలను ఘటనే నిదర్శనమన్నారు. మిమ్మల్ని ప్రజలు గెలిపించింది చందాలు వేసుకొని రోడ్లు వేసుకోవడానికా? అని ప్రశ్నించారు. అమాయకులపై దౌర్జన్యంగా లాఠీచార్జీ చేసిన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అడవికొలను రహదారి నిర్మాణం కోసం తన వంతుగా బొలిశెట్టి రూ.10 వేలు స్థానిక సర్పంచ్‌ పాలా వెంకటేశ్వరరావుకు అందజేశారు. నాయకులు నిమ్మల దొరబాబు, పి.హరనాథ్‌, కొండా చింతయ్య, పాలా సత్యనారాయణ, మైలవరపు సురేంద్ర, వాసు, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-31T05:25:00+05:30 IST